అహంకారంతోనే జగన్‌కు ఈ పరిస్థితి: మోత్కుపల్లి నరసింహులు

ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన అహంకార పూరిత వైఖరితోనే ఎన్నికల్లో దారుణ ఓటమి పరిస్థితిని తెచ్చుకున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు.

అహంకారంతోనే జగన్‌కు ఈ పరిస్థితి: మోత్కుపల్లి నరసింహులు

విధాత : ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన అహంకార పూరిత వైఖరితోనే ఎన్నికల్లో దారుణ ఓటమి పరిస్థితిని తెచ్చుకున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఏపీలో టీడీపీ కూటమి విజయంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాడని, రేవంత్ పాల‌న ఎలా చేయాలో నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మోత్కుపల్లి న‌ర్సింహులు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఎన్నిక‌ల హామీల‌ను ఎందుకు ఇంకా నెర‌వేర్చ‌లేదోనని, పేద ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ దూరం అవుతుందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఇదే పార్టీలోనే కొనసాగుతానని మోత్కుపల్లి స్పష్టం చేశారు.

ద‌ళితుడైన తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, మంత్రిగా చేశానని గుర్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని ముందుగా చెప్పింది తానేనని, కానీ మొద‌ట‌గా సీఎం మ‌మ్మ‌ల్నే రోడ్డున ప‌డేశారని వాపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో మాదిగ‌ల‌కు ఒక్కంటే ఒక్క ఎంపీ సీటు ఇవ్వ‌లేదని, ఆరు గంట‌ల పాటు స‌చివాల‌యంలో కూర్చున్నా నాకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదని, ఇన్నేళ్ల త‌న రాజ‌కీయ జీవితంలో ఇంత అవ‌మానం ఎక్క‌డ జ‌ర‌గ‌లేదన్నారు. జ‌గ‌న్ అహంకారం వ‌ల్ల ఈ రోజు ఈ ప‌రిస్థితి తెచ్చుకున్నాడని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.