పోలీసులు అత్యుత్సాహాన్ని మానుకోవాలని హితవు .. పల్లా అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం

నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిసహా పార్టీ నాయకులను అరెస్టు చేయడంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు

  • Publish Date - July 1, 2024 / 06:15 PM IST

విధాత, హైద‌రాబాద్ : నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిసహా పార్టీ నాయకులను అరెస్టు చేయడంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు, యువకులు చేస్తున్న పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ హాస్పిటల్ వద్ద నిరుద్యోగ యువకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అత్యుత్సాహం మానుకోవాలని హెచ్చరించారు. నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో పరామర్శించటం, నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే నిరుద్యోగులను తరుముతూ పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని ఆరోపించారు. నిరుద్యోగులు, యువకులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ లను వెంటనే జారీ చేయాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి సర్కార్ ను కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బీఆరెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Latest News