దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టడం వల్లనే లోక్ సభ ఎన్నికలలో మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు
ఇండియా కూటమికి పెరిగిన మద్దతు
బీఆరెస్ ఇష్టారీతి వల్ల ఓటమిపాలయ్యారు
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రతినిధి:
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టడం వల్లనే లోక్ సభ ఎన్నికలలో మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా స్థాయి సీపీఐ రాజకీయ శిక్షణా తరగతులు ధర్మ సాగర్ మండల కేంద్రంలో ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకట్ రెడ్డి శిక్షణా తరగతులు ప్రారంభించి మాట్లాడుతూ మోడీ పదేళ్ల పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి భిన్నంగా పాలన జరిగిందని, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేశారని అన్నారు. దేశంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేసి,అనేక మందిపై అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపారని అన్నారు. రైతుల, కార్మికుల వ్యతిరేక చట్టాలు తెచ్చారని, ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టారని, దాదాపు 12 లక్షల కోట్లు రాయితీ ఇచ్చారని అన్నారు. చివరకు విభజన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని, బీజేపీ కి పూర్తి మెజారిటీ రాలేదని, టిడిపి, జేడియూ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.
లోక్ సభకు ఎన్నికైన వారిలో 259 మంది నేర చరిత్ర కలవారు ఎంపీలుగా ఉన్నారని,కేంద్ర మంత్రి వర్గాన్ని కూడా నేర చరిత్ర ఉన్న వారితో నిండిపోయిందన్నారు. భవిష్యత్తులో ఇండియా కూటమి కూడా ప్రజల మద్దతు కూడగట్టేందుకు మరింత పట్టుదలగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించడం వల్లనే ఇంటికి సాగనంపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. కమ్యూనిస్టులు ప్రజల మద్య ఉండి పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్,మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు కర్రె లక్ష్మణ్, ఉట్కూరి రాములు, మునిగాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు
సీపీఐ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభం
రెండు రోజుల పాటు జరుగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా స్థాయి శిక్షణా తరగతులు శనివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలుత సీపీఐ పతాకాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు ఎగురవేశారు.ఈ శిక్షణా తరగతులకు ఆదరి శ్రీనివాస్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించగా మార్క్సిజం పై నేదునూరి రాజమౌళి, పార్టీ నిర్మాణం పై మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి బోధించారు.ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి నాయకులు లక్ష్మినారాయణ, ఆరెళ్లి రవి, కొట్టెపాక రవి ఆద్వర్యంలో పాటలు పాడి చైతన్య పరిచారు.
*