విధాత : సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల దోపిడి లక్ష్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసి, ప్రాజెక్టు స్వరూపం పూర్తిగా మార్చారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. శనివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హాయంలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను రీడిజైన్ చేసిన కేసీఆర్ కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్లానింగ్ ,డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషనల్ మేనేజ్ మెంట్ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర డ్యామ్సేఫ్టీ ఆథార్టీ కమిటీ నివేదికతో తేలిపోయిందన్నారు.
ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 38,500 కోట్ల నుంచి రూ.1లక్ష 51 వేల కోట్లకు అంచనాలను పెంచి భారీ అవినీతికి కేసీఆర్ ప్రభుత్వం పాల్పడిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రణాళిక ప్రకారం డిజైన్ చేయలేదని, నిర్మాణం ప్రకారం నిర్వహణ లేదన్నారు. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైందన్నారు. కేసీఆర్ పాపం పండిందని మేడిగడ్డ కుంగిందన్నారు. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్ మేడగడ్డ కుంగిపోవడాన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇంత జరిగినా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పై నోరు మెదపలేదన్నారు.
నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే ప్రభుత్వం వివరాలను దాచిపెట్టిందని ఆరోపించారు. వేల కోట్లు నష్టం జరిగినా కేంద్రం సీబీఐ విచారణ ఎందుకు అదేశించడంలేదని ప్రశ్నించారు. అవినీతి వాసన గిట్టదని చెప్పుకునే ప్రధాని నరేంద్రమోడీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదన్నారు. బీఆరెస్ బీజేపీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తోందని, అందుకే బీఆరెస్ ను బీజేపీ కాపాడుతోందని రేవంత్ ఆరోపించారు. ప్రాజెక్టు పరిస్థితి పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నివేదిక విడుదల చేయడంలేదన్నారు.
ప్రాజెక్టులో లోపాలపై సీఎం ఎందుకు వివరణ ఇవ్వడం లేదు? ఎందుకు ప్రజల ముందుకు రావడం లేదు? అని నిలదీశారు. సంబంధింత నిర్మాణ కంపెనీపై ఎందుకు విచారణకు ఆదేశించాలని చెప్పడంలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు అంచనాలు, పెంచిన వ్యయం, ఖర్చు.. ఈ మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
అధికారులపై నెట్టే ప్రయత్నం
మేడిగడ్డ తప్పును అధికారులపై నేట్టేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారన్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ, నిర్మాత, దర్శక, పర్యవేక్షణ అంతా కేసీఆర్ అన్నారు. సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి నివేదిక ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. టెండర్లు 80 వేల కోట్లు చూపించి రేవైజ్డ్ ఎస్టిమేట్ లో 1లక్ష 51 వేల కోట్లకు పెంచారని రేవంత్ ఆరోపించారు. ఇప్పటికే ప్రాజెక్టుపై 1లక్షా 2వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది.. అతని కుటుంబం ఆర్ధిక ఉగ్రవాద కుటుంబమన్నారు. వీరిని తక్షణమే శిక్షించాలని, దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇతర రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో ఒక కమిటీ వేయాలని, సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కమిటీ విచారణ జరిపేలా, సంపూర్ణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. అలాగే సంబంధిత శాఖల మంత్రులైన హరీష్ రావు, కేసీఆర్ ను పదవుల నుంచి తొలగించాలని, దీనిపై కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్ దీనిపై స్పందించాలని కోరారు. ప్రధాని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు..కానీ ప్రాజెక్టులను పరిశీలించడంలేదని, తక్షణమే మోదీ మెడిగడ్డను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అవినీతి వాసన పడదంటున్న మోదీ మరి కేసీఆర్ అవినీతి కంపును ఎలా భరిస్తున్నారని, జరిగిన లోపాలపై విచారణ చేపట్టాలని ప్రతిపక్షంగా కేంద్రాన్ని మేం డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రం నివేదికతో చేతులు దులుపుకోకుండా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక మేం ఏం చేస్తామనేది అప్పుడే చెబుతామన్నారు. కాంగ్రెస్కు మద్దతు తెలిపిన, కాళేశ్వరం అవినీతిని మొదటి నుంచి ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం ను తెలంగాణ వ్యతిరేకి అంటే.. తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని హెచ్చరించారు.