CM Revanth Reddy : చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఉస్మానియా
సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్-స్టాన్ఫోర్డ్ స్థాయిలో అభివృద్ధి చేసి తెలంగాణ గర్వం చేయనున్నట్లు ప్రకటించారు.

ఓయూ లేకుంటే తెలంగాణ లేదు
ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ స్థాయిలో యూనివర్సిటీ అభివృద్ధి
పోలీసులు..నిరసన కారులను అడ్డుకోవద్దు
వాళ్ళు మళ్ళీ వస్తే ఉస్మానియాను ఉండనివ్వరు
హాస్టళ్ల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్ట్ 25(విధాత): తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలవాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని సీఎం తెలిపారు. తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది అని, దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని వెల్లడించారు. తెలంగాణ నలుమూలలా ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది యూనివర్సిటీలోనే అని తెలిపారు. చదువుతోపాటు పోరాటాన్ని నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారిది ఉస్మానియా యూనివర్సిటీనే అని పేర్కొన్నారు. యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సాధనలో సమిధలయ్యారని గుర్తు చేశారు.
‘ఎంతో మంది మేధావులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది. గత పదేళ్ల పాలనలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని మేం ఆలోచన చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమినచాం. చదువుకుని చైతన్యం ఉన్న వారిని వీసీలుగా నియమించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచే మేధా సంపత్తిని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆశిస్తున్నామన్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందన్నారు. యువతను గంజాయి, డ్రగ్స్ వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయని, ఆ వ్యసనాల నుంచి యువతను బయటపడేలా చేయాలన్నారు.
యూనివర్సిటీ అభివృద్ధి అధ్యయనానికి ఇంజనీర్స్ కమిటీ వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కనిపించొద్దు.. నిరసన తెలిపే వారిని నిరసన తెలపనివ్వండి, నేను రావొద్దని అడ్డుకునే వారికి సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది’ అని సీఎం అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులకు పదవులు పోయాయన్న ఆవేదన ఉంటుందని వారి ఉచ్చులో పడొద్దని విద్యార్థులకు రేవంత్ సూచించారు. సమస్య ఉంటే మాకు చెప్పండి.. మా మంత్రులు మీకు అందుబాటులో ఉంటారు.
‘కోదండరామ్ సార్ పై కుట్ర చేసి సుప్రీం కోర్టుకు వెళ్లి పదవి తొలగించారు. మళ్లీ కోదండరాం సార్ కు ఎమ్మెల్సీ ఇస్తాం. అపోహలకు లోను కాకండి. అబద్ధాల సంఘం చెప్పే మాటలు నమ్మొద్దు. వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు’ అని సీఎం పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నాయని ప్రచారం చేసి అడ్డుకున్నారన్నారు. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేనేలేవు..మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయన్నారు. వాళ్లు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు లాంటివారని, వాళ్లు మళ్లీ వస్తే ఉస్మానియా యూనివర్సిటీని ఉండనువ్వరని సీఎం విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కోదండరామ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.