రైతుబంధు డబ్బులను ఈ నెల 9లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు
విధాత, హైదరాబాద్ : రైతుబంధు డబ్బులను ఈ నెల 9లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహయం రఘురాంరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రైతుబంధు డబ్బులను 65లక్షల మంది ఖాతాల్లో వేశామని, మిగిలిన వారందరికి 9వ తేదీలోపు వేస్తామని ఒక్కరికి బకాయి ఉన్నా అమరవీరుల స్థూపం వద్ధ ముక్కు నేలకు రాస్తానన్నారు. రైతుబంధు అందరికి అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ సవాల్ విసిరారు.
రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ఎవరైన అంటే వారిని చెప్పుతో కొట్టాలని కిషన్రెడ్డి, బండి సంజయ్లు అన్నారని, ఆ మాటలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ అన్నారని, ఆయన చెప్పిన మాటలనే నేను చెప్పానని, ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో కిషన్రెడ్డి, బండి సంజయ్లు చెప్పాలన్నారు. ఖమ్మంలో బీఆరెస్ ఎంపీగా నామా నాగేశ్వర్రావును గెలిపిస్తే ఆయన కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అవుతారని కేసీఆర్ చెప్పారని, ఆయన ఏ సంకీర్ణంలో మంత్రి అవుతారో కేసీఆర్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ సంకీర్ణంలో తాము చేర్చుకోబోమని, కేసీఆర్ చేరేదీ బీజేపీ సంకీర్ణంలోనేనని, ఎందుకంటే గతంలో బీజేపీ బిల్లులకు కేసీఆర్ మద్దతునిచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ను ఓడించి సెమిఫైనల్స్లో గెలిచామని, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో జరుగుతున్న ఫైనల్లోనూ కాంగ్రెస్ గెలువాలన్నారు. ఇందుకు ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలని కోరారు.