నగరంలోని సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రికి మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరును పెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్థానంలో…డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా పేరు ఖరారు చేసింది. మర్రి చెన్నారెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలకుగాను ఆయన పేరును పెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. 1000 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని నూతనంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిని గుండె జబ్బుల చికిత్స, అవయవ మార్పిడి వంటి అత్యాధునిక వైద్య సేవలు అందించే ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా అభివృద్ధి చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైద్య సేవలను వికేంద్రీకరించే లక్ష్యంతో పాటు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించడం, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో నగరం నలువైపులా ‘టిమ్స్’ పేరుతో సూపర్స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే 2022 ఏప్రిల్ 26న ఒకేరోజు సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో మూడు సూపర్స్పెషాలిటీ దవాఖానల నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గత సంవత్సరమే మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు అందుబాటులోకి రావాల్సి ఉండగా, ప్రస్తుతం సనత్నగర్ టిమ్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.రూ.882 కోట్ల అంచనా వ్యయంతో 53 ఎకరాల విస్తీర్ణంలో ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు.
