Phone Tapping Case | హైదరాబాద్ : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు అధికారులను, రాజకీయ నేతలను విచారించగా, తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వంతు వచ్చింది. బండి సంజయ్కి నోటీసులు ఇచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) సిద్ధమైంది. ఈ క్రమంలో సంజయ్కు నిన్న రాత్రి సిట్ అధికారులు ఫోన్ చేసినట్లు సమాచారం.
మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని, విచారణకు సిద్ధంగా ఉండాలని పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి వాంగ్మూలం తీసుకునేందుకు పోలీసులు సమయం కోరినట్లు సమాచారం. షెడ్యూల్ చూసుకుని టైం చెబుతానని కేంద్ర మంత్రి చెప్పినట్లు సమాచారం. రేపో మాపో బండి సంజయ్కు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత బండి సంజయ్ తెరపైకి తీసుకొచ్చారు. కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ఆయన పలుమార్లు ఆరోపించారు. కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది, ప్రధాన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారని సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు బండి సంజయ్తోపాటు కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి సంజయ్ నివాసంపై దాడి చేసి టెన్త్ పేపర్ లీక్ పేరుతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కరీంనగర్ ఎంపీ ఆఫీసులో 317 జీవో సవరణ దీక్ష జరగకుండా నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నించి పోలీసులు భంగపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఫోన్ ట్యాప్తో తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పలుమార్లు సభల్లో, మీడియా వేదికల ద్వారా బండి సంజయ్ ఆరోపించారు.
భార్యాభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం నీచానికి ఒడిగట్టిందని గతంలో సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనని సిట్ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. వందలాది మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు నిర్దారణ అయిందని, సాక్షిగా బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. బండి సంజయ్ వాంగ్మూలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.