బీఆరెస్ పార్టీలో నాకు ఎలాంటి న్యాయం జరుగలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మలిదశ తెలంగాణ ఉద్యమం తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ కీలక ప్రకటన చేశారు.
శంకరమ్మకు తగిన ప్రాధాన్యతనిస్తాం : ఉత్తమ్కుమార్రెడ్డి
విధాత, హైదరాబాద్ : బీఆరెస్ పార్టీలో నాకు ఎలాంటి న్యాయం జరుగలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మలిదశ తెలంగాణ ఉద్యమం తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నానని ప్రకటించారు. రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ స్థానాలు గెలవడం కోసం నా వంతు కృషి చేస్తానని తెలిపారు. గాంధీభవన్లో గురువారం మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. శంకరమ్మ తెలంగాణ ఏర్పాటు తర్వాత.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి బీఆరెస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి చేతిలో ఓడిపోయారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో శంకరమ్మను కాదని శానంపూడి సైదిరెడ్డికి టికెట్ ఇవ్వగా ఆయన కూడా ఉత్తమ్కుమార్రెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2019లో ఎంపీగా ఎన్నికవ్వడంతో ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో సైతం సైదిరెడ్డికి తిరిగి టికెట్ ఇవ్వగా ఆయన పద్మావతి ఉత్తమ్పై గెలుపొందారు. ఈ పరిణామాల సందర్భంగా శంకరమ్మ పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, తనకు న్యాయం చేయాలంటూ సీఎం కేసీఆర్, కేటీఆర్ను పలుమార్లు కోరారు. వివిధ వేదికలపై తనతో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని శంకరమ్మ బహిరంగంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆమె ఎక్కడ కాంగ్రెస్లోకి పోతుందోనన్న ఆలోచనతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సిద్ధమై ప్రభుత్వ వాహనం, పీఏను సైతం కేటాయించి వెనక్కి తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం శంకరమ్మ సీఎం రేవంత్రెడ్డిని కలిసిన సందర్భంలో ఆమె కాంగ్రెస్లో చేరుతారని ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న ప్రచారం వినిపించింది. ఆ వెంటనే ఆమె బీఆరెస్ సమావేశాల్లోనూ కనిపించింది. ఊగిసలాటల మధ్య చివరకు బీఆరెస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా ప్రకటించింది.
శంకరమ్మకు తగిన ప్రాధాన్యతనిస్తాం : ఉత్తమ్కుమార్రెడ్డి
తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరవదని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన వందలాది మంది బీఆరెస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.
హుజుర్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయన్నారు. తెలంగాణకు పదేళ్లు సీఎంగా ఉండి కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేయలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్ పార్టీలు అబద్ధాలు ప్రచారం చేసుకుని గెలవాలని ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి శూన్యమని, అదాని కాంగ్రెస్ మనిషి అన్నట్లు మోదీ దిగజారి మాట్లాడుతున్నారన్నారు.ఇండియా కూటమి కేంద్రంలో, అధికారంలోకి వస్తుందన్న సమాచారంతోనే మోదీ అబద్దాల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్నిమద్దతు ధరకు ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.