గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి .. మంత్రి దనసరి అనసూయ సీతక్క

గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.

గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి .. మంత్రి దనసరి అనసూయ సీతక్క

త్వరలో మహిళలకు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలకు ప్రోత్సాహం

ములుగు జిల్లా కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

— రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ

విధాత, వరంగల్ ప్రతినిధి:

గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. లతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు జిల్లాలో నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.

– మహిళా ఉపాధికి రూ. 20వేల కోట్ల రుణం

రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ సంవత్సరం 20 వేల కోట్ల రూపాయలు రుణాలు బ్యాంక్ లింకేజీ ద్వారా అందిస్తామని, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభిస్తామని చెప్పారు. నూతన ఆహార పదార్ధాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 60 లక్షల పాఠశాలల యూనిఫామ్ లను మహిళా సంఘాల ద్వారా కుట్టించామని పేర్కొన్నారు. మహిళా శక్తి క్యాంటీన్ లలో ఆహారం అమ్మ చేతి వంటల ఉండాలని , నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు దేశానికే ఒక బ్రాండ్ గా నిలవాలని , స్థానిక వనరులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ ను త్వరలోనే రూపొందిస్తామని , రానున్న ఐదు సంవత్సరాలలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందించడంతో పాటు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు, క్యాంటీన్ల ఏర్పాటు కు అన్ని రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందించడంతోపాటు
వడ్డీ లేని రుణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, మహేందర్ జి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, జిల్లా అధికారులు, ప్రియదర్శిని మహిళా పొదుపు సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.