వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ప్రతి ఇంటికి రోజూ తాగునీటి సరఫరా జరిగాల్సిందేనని ప్రభుత్వం వర్క్ ఏజెన్సీలకు స్పష్టం చేసింది.
విధాత: వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ప్రతి ఇంటికి రోజూ తాగునీటి సరఫరా జరిగాల్సిందేనని ప్రభుత్వం వర్క్ ఏజెన్సీలకు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని పైప్ లైన్ మరమ్మత్తులు 12 గంటల్లోగా పూర్తి చేయాలని అల్టిమేటమ్ జారీ చేసింది. అలాగే అన్ని పంప్ సెట్ల మరమ్మత్తులు ఏప్రిల్ 12వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, మిషన్ భగీరథ ఇ ఎన్సీ జి. కృపాకర్ రెడ్డి లతో కలిసి ఎస్ ఇలు, మిషన్ భగీరథ ఓ అండ్ ఎమ్ పంప్సెట్స్ అధికారులతో పాటు వర్క్ ఏజెన్సీలైన మేఘా ఇంజనీరింగ్, రాఘవ కన్ స్ట్రక్షన్స్, ఎన్ సి సి, ఎల్ అండ్ టి, ఐహెచ్పి, కోయ అండ్ కంపెనీ ,ప్రతిభ ఇండస్ట్రీస్, జివిపిఆర్, కేఎల్ఎస్ఆర్ మొదలైన సంస్థలతో నీటి సరఫరా, నిర్వహణ పై సమీక్షా సమావేశాన్నినిర్వహించారు.
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసవిలో నీటి సరఫరా చాలా కీలకమని సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. ఈ మేరకు అన్ని గ్రామీణ ఆవాసాలలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. పంపు సెట్లలో కానీ పైప్లైన్లో కానీ విద్యుత్ సరఫరాలో కానీ ఏదైనా చిన్న సమస్య ఏర్పడితే కొన్ని ఆవాసాలకు నీటి సరఫరా ఇబ్బంది కలిగే అవకాశముందన్నారు. అన్ని ఇండ్లకు నిరవధికంగా తాగు నీటిని సరఫరా చేయడానికి ఓ అండ్ ఎమ్ సమర్థవంతంగా పని చేయాలన్నారు. ఈ మేరకు ఏప్రిల్ 12వ తేదీనాటికి అన్ని పంప్ సెట్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని సుల్తానియా ఆదేశించారు.
ఈ మేరకు పంప్ సెట్స్ ఏజెన్సీలు తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, సంబంధిత చీఫ్ ఇంజనీర్లకు సమర్పించాలన్నారు. అలాగే ఏజెన్సీలు పంపు సెట్స్ సంబందించిన విడిభాగాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పైప్లైన్ మరమ్మతులన్నింటిని 12 గంటల్లో పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీలకు నిర్దేశించారు. నిర్దేశించిన సమయానికి మరమ్మత్తులు పూర్తి చేస్తామని ఏజెన్సీలు ప్రభుత్వానికి తెలిపాయన్నారు. రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న సమస్యాత్మక ఆవసాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్దవహించి, ప్రతిరోజూ నీటి సరఫరా అయ్యేటట్టు చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.