రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది
హైదరాబాద్ : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రభుత్వ, ప్రయివేట్ ఎయిడెడ్, ప్రయివేటు ఆన్ ఎయిడెడ్, కో ఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనార్టీ, కేజీబీవీ, టీఎంఆర్జేసీలు, టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీలతో పాటు కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో రెండేండ్ల ఇంటర్ కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నారు.
మే 9వ తేదీ నుంచి తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 9 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆయా ఇంటర్ కాలేజీల్లో స్వీకరించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీ లోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
ఇక ఇంటర్లో ప్రవేశం తీసుకోవాలనుకునే విద్యార్థులు ఇంటర్నెట్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు తప్పనిసరిగా దరఖాస్తుకు జతపరచాలి. ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తయిన తర్వాత కచ్చితంగా ఒరిజినల్ మెమోతో పాటు టీసీ సమర్పించాల్సి ఉంటుంది. పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకూడదని ఆయా కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.
ఇంటర్ కాలేజీల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, వికలాంగులకు 5 శాతం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా కింద 5 శాతం, ఎక్స్ సర్వీస్మెన్కు 3 శాతం, ఈడబ్ల్యూఎస్ కేటగిరి విద్యార్థులకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లను కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ప్రకారం సీట్ల భర్తీ జరగాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది.