TSRTC Announces Special Buses For Dussehra | బతుకమ్మ, దసరాకు7754 ప్రత్యేక బస్సులు
బతుకమ్మ, దసరా పండుగల కోసం TSRTC 7754 ప్రత్యేక బస్సులు.. రిజర్వేషన్ సౌకర్యం, ప్రత్యేక చార్జీలు, రద్దీ ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు.

హైదరాబాద్, సెప్టెంబర్18(విధాత): బతుకమ్మ, దసరా పండుగలకు తెలంగాణ ఆర్టీసీ 7754 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఇందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపింది. ఈ ప్రత్యేక బస్సులను ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు నడుపుతామని పేర్కొన్నది. ఈ మేరకు గురువారం తెలంగాణ ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున ప్రజలను మూడు రోజుల ముందు నుంచే సొంతూళ్లకు పయణమవుతారని తెలిపింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఈ నెల 27వ తేదీ నుంచే ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదిల్లోనూ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుతామని సంస్థ ప్రకటించింది.
స్పెషల్ బస్సులు ఇక్కడి నుంచే…
హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతామని సంస్థ తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ వెల్లడించింది.
స్పెషల్ బస్సులకు చార్జీలు స్పెషలే..
దసరా స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరిస్తామని ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదివరకు వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 వ తేదిల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యూలర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని, అమలులో ఉన్న చార్జీలే ఉంటాయని తెలిపింది.
“బతుకమ్మ, దసరా పండుగలకు గత ఏడాది కంటే ఈ సారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ తెలిపింది. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నది. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, సంతోష్ నగర్, తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.