జేఎస్ఆర్ సన్ సిటీ రియల్ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేసిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
విధాత, హైదరాబాద్: జేఎస్ఆర్ సన్ సిటీ రియల్ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేసిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్లో ఓ హాస్టల్లో ఉంటూ మియాపూర్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ డిపార్ట్ మెంట్ ట్రైనీగా జాయిన్ అయింది. అదే రియల్ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్లుగా పనిచేస్తున్నసంస్థ వైస్ చైర్మన్ సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఆ యువతిపై కన్నేశారు. సైట్ విజిట్ కోసం అంటూ ఆ యువతిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
యాదాద్రిలో సైట్ విజిట్ చేశాక తిరిగి వచ్చే క్రమంలో కూల్ డ్రింక్లో మత్తుమందు ఇచ్చి ఆమెపై కారులోనే లైంగికదాడికి పాల్పడ్డారు. నాలుగు గంటల పాటు కారులోనే తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. యువతి అనారోగ్యంతో ఉన్నా వినిపించుకోకుండా లైంగికదాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్న ఆ యువతి మంగళవారం రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి, అక్కడి నుండి మియాపూర్కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు. నిందితులిద్ధరిని అరెస్టు చేసినట్లుగా తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు.