AMVI । పోటీపరీక్షలకు సిద్ధమయ్యేలా నిరుద్యోగ యువతలో స్ఫూర్తి నింపాలి : సీఎం రేవంత్‌రెడ్డి

ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారిని రోల్ మోడల్ గా తీసుకోవాలో.. డ్రగ్స్, సారా బుడ్లతో దావత్ చేసుకునే వారిని స్ఫూర్తిగా తీసుకోవాలో యువత ఆలోచించాలన్నారు. సరిహద్దుల్లో గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలోకి రాకుండా ఉక్కు పాదం మోపాలని ఏఎంవీఐలను కోరారు. ఇది ఉద్యోగం కాదు.. ఇది భావోద్వేగమని వ్యాఖ్యానించారు.

AMVI । పోటీపరీక్షలకు సిద్ధమయ్యేలా నిరుద్యోగ యువతలో స్ఫూర్తి నింపాలి : సీఎం రేవంత్‌రెడ్డి

AMVI  । పోటీపరీక్షలకు సిద్ధమయ్యేలా మీ గ్రామాల్లో నిరుద్యోగ యువతలో స్ఫూర్తి నింపాలని కొత్తగా నియమితులైన అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. అసిస్టెంట్​ మోటార్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్లకు నియామక పత్రాలను ముఖ్యమంత్రి సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆరెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో చిక్కుముడి విప్పుడుతూ.. పది నెలల్లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. తాము బాధ్యతలు తీసుకున్న ఎల్బీ స్టేడియంలోనే నియామక పత్రాలు అందించి నిరుద్యోగుల తల్లిదండ్రులకళ్లల్లో ఆనందం చూశామని, అది తనకు అత్యంత సంతృప్తి కలిగించిన సందర్భమని ముఖ్యమంత్రి చెప్పారు.

‘ఇక్కడ ఎంపికైన AMVI లకు ఈ వేదికగా సూచన చేస్తున్నా.. మీ గ్రామంలో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడండి.. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేలా స్ఫూర్తి నింపండి. చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం అని వారికి విశ్వాసం కల్పించండి. ప్రభుత్వంపై నమ్మకం కలిగించండి’ అని కోరారు. దీపావళి పండుగ రోజున డ్రగ్స్ తీసుకుని గృహప్రవేశం అని కొందరు బుకాయించే ప్రయత్నం చేశారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘లీడర్ అంటే లీడ్ చేసేవాడు.. అందరికీ రోల్ మోడల్ గా నిలిచేలా ఉండాలి.. కానీ పండగ వస్తే డ్రగ్స్, సారా బుడ్లతో దావత్ చేసుకునే వారు కాదు’ అన్నారు. అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారిని రోల్ మోడల్ గా తీసుకోవాలో.. డ్రగ్స్, సారా బుడ్లతో దావత్ చేసుకునే వారిని స్ఫూర్తిగా తీసుకోవాలో యువత ఆలోచించాలన్నారు. సరిహద్దుల్లో గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలోకి రాకుండా ఉక్కు పాదం మోపాలని ఏఎంవీఐలను కోరారు. ఇది ఉద్యోగం కాదు.. ఇది భావోద్వేగమని వ్యాఖ్యానించారు. కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలంటే రవాణా శాఖ సంపూర్ణ సహకారం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒక పాలసీ తీసుకొస్తామని తెలిపారు.