Site icon vidhaatha

Bandi Sanjay | భట్టి చదివింది.. బడ్జెట్టా లేక అప్పుల పత్రమా..? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు

కాంగ్రెస్ రాష్ట్ర బడ్జెట్ గాడిద గుడ్డేనా!
భట్టి చదివింది బడ్జెట్టా? అప్పుల పత్రమా?
ఆరు హామీలకు కేటాయింపులేవి?
మూసీ రివర్‌ఫ్రంట్‌కు పైసా ఇవ్వలేదు
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

విధాత : కేంద్ర బడ్జెట్‌ను గాడిద గుడ్డుతో అభివర్ణించిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కూడా గాడిద గుడ్డేనా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. గాడిద గుడ్డు పెట్టకపోవడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోవడం కూడా అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమన్నారు. అసలు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చదివింది బడ్జెట్ ప్రసంగమా? లేక అప్పుల పత్రమా? అని ప్రశ్నించారు. అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అని నిలదీశారు. అప్పులున్న విషయం ముందు తెలిసీ 6 గ్యారంటీలిచ్చిన మీరు వాటన్నింటికీ బడ్జెట్‌లో నిధులెందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు సహా మీ హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా? అని మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపులకు సరిపడా ఆదాయం ఎక్కడి నుండి సమకూర్చుకుంటారో లెక్కలు చూపకపోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు లెక్కన అమ్మాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. హామీలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్‌కు మాటలెక్కువని బడ్జెట్ చూస్తే అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చి, 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్‌కు బడ్జెట్‌లో పైసా కేటాయించని మీరు కేంద్రంపై విమర్శలు ఎట్లా చేస్తారని ప్రశ్నించారు. రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయాపైసా కేటాయించకపోవడం మతతత్వం కాదా? అని నిలదీశారు. ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందూ ప్రజలకు తీవ్రమైన నష్టం చేయడమేనా మైనారిటీ డిక్లరేషన్ అంటే? అని ప్రశ్నించారు. రుణమాఫీవల్ల రైతులకు లాభం కంటే నష్టమే జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకొన్నదని అన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుండి తొలగిస్తారా? లేదా? చెప్పాలన్నారు. ఏడాదిపాటు నష్టపోయిన ‘రైతు భరోసా’, రూ.500 బోనస్, పంట నష్ట పరిహారం నిధులను కూడా ఈ ఏడాది చెల్లిస్తారా? లేదో చెప్పాలన్నారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు తక్కువ నమోదు కావడమే 10 ఏళ్ల కాంగ్రెస్, బీఆరెస్‌ పాలనకు అద్దం పడుతున్నదని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

జిల్లా, నియోజకవర్గాల పేర్ల ప్రవస్తాన లేనందుకు రాజీనామా చేస్తారా?

బడ్జెట్ చివరి పేజీలో ప్రస్తావించిన మహాత్ముడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులకు, కాంగ్రెస్‌ ఇచ్చిన అలవికాని హామీలకు మధ్య ఉన్న అంతరాన్ని గ్రహించాలని హితవు పలికారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్‌లోనే తేలిపోయిందన్నారు. బడ్జెట్ లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదు… సీఎం సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా? అని నిలదీశారు. తెలంగాణలో సమసమాజం స్థాపిస్తామనడం ఈ శతాబ్దం జోక్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

Exit mobile version