T. Harish Rao | 25,26తేదీల్లో మేడిగడ్డ సందర్శన ,నిరుద్యోగ సమస్యలపై వాయిదా తీర్మానం : మాజీ మంత్రి టి.హరీశ్రావు
మేడిగడ్డ బ్యారేజీని బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఈ నెల 25,26తేదీల్లో సందర్శించాలని బీఆరెస్ ఎల్పీ నిర్ణయించింది. శాసన సభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆరెస్ ఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు

ఫిరాయింపులపై ప్రత్యేక వ్యూహం
పౌరసరఫరాల కుంభకోణం..బీర్ బ్రాండ్ల అనుమతులపై చర్చకు పట్టు
ఫీజు రీయంబర్స్మెంట్ ..రైతు భరోసాలపై ఒత్తిడి
బీఆరెస్ఎల్పీలో నిర్ణయాను వెల్లడించిన మాజీ మంత్రి టి.హరీశ్రావు
విధాత : మేడిగడ్డ బ్యారేజీని బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఈ నెల 25,26తేదీల్లో సందర్శించాలని బీఆరెస్ ఎల్పీ నిర్ణయించింది. శాసన సభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆరెస్ ఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోయకుండా దిగువకు వదులుతుందని, ఎన్డీఎస్ఏ సూచన మేరకు బ్యారేజీ రక్షణ, ప్రజా హితం దృష్టానే బ్యారేజీ గేట్లు తెరిచామనిచెబుతుందని బీఆరెస్ ఆరోపిస్తుంది. బ్యారేజీ వద్ధ వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ప్రజలకు చెప్పాలని బీఆరెస్ ఎల్పీ నిర్ణయించింది. అలాగే శాసన మండలి పక్ష నేతగా ఎమ్మెల్సీ మధుసూధనచారిని ఈ సమావేశంలో ఎంపిక చేశారు.మిగతా కార్యవర్గాన్ని తదుపరి ప్రకటించనున్నారు. బీఆరెస్ ఎల్పీ సమావేశం వివరాలను మాజీ మంత్రి టి.హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లతో కలిసి వివరించారు. కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని హరీశ్రావు విమర్శించారు. రేపు పార్లమెంటులో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అదే రోజున మేడిగడ్డ పర్యటనకు బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరుతుందని తెలిపారు. ఈ నెల 26న మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజ్ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సందర్శిస్తుందని, లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వృథాగా పోతున్నా ఈ ప్రభుత్వం పంపుల ద్వారా నీళ్లు ఎత్తిపోయడం లేదన్నారు. మిడ్ మానేరు, కొండ పోచమ్మ సాగర్, రంగ నాయక సాగర్లలో నీళ్లు నింపి రైతుల పొలాలకు తరలించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామన్నార. ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కార్యాచరణ ఖరారు చేశామని తెలిపారు. నిరుద్యోగుల సమస్యలపై బుధవారం చర్చ కోసం రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో పాల్పడ్డ కుంభకోణాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. పౌరసరఫరాల శాఖలో కుంభకోణాలు జరిగాయని, వాటిని లేవనెత్తుతామని, వేరే రాష్ట్రాల్లో నిషేధించిన బీర్లను ఇక్కడ ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నాల వెనుక ఉన్న అదృశ్య శక్తుల బండారాన్ని బయట పెట్టాలని అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు.
మంత్రి కి తెలియకుండానే నిషేధిత బీర్ల ప్రవేశం కోసం ప్రయత్నం ఎలా జరిగింది అనే దానిపై చర్చకు పట్టుబడుతామని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో మిగిలిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మేము చెల్లించామని, ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియలో జాప్యంపై నిలదీస్తామని, రైతు భరోసా ఆలస్యంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, ఫిరాయింపులపై అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహం తో ముందుకు వెళ్తామన్నారు. కేసీఆర్ అన్ని అంశాలపై మాకు దిశా నిర్దేశం చేశారని, కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసమే కేంద్ర మంత్రులతో భేటీలు అన్న రేవంత్ ఇప్పుడు ఏం చెబుతారని నిలదీశారు. రాహుల్ గాంధీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడరా? రాహుల్ గాంధీతో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రేవంత్ మాట్లాడించాలని బీఆరెస్ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రధాని కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయాలని, పార్లమెంటు పోడియం దగ్గరికి వెళ్లి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నిరసన తెలపాలని కోరారు. ముందస్తు అనుమతితోనే కొందరు ఎమ్మెల్యేలు ఈ రోజు భేటీకి హాజరుకాలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కోవా లక్ష్మి, విజయుడు, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి పాల్గొన్నారు.