కుటుంబ అభ్యంతరాల మధ్య ముస్లిం బాయ్ఫ్రెండ్ను పెళ్లాడిన కుంభమేళా మోనాలీసా: కేరళం ఆలయంలో వివాహం
మహాకుంభమేళా సందర్భంగా వైరల్ అయిన మోనాలిసా భోంస్లే కేరళంలో తన బాయ్ఫ్రెండ్ ముహమ్మద్ ఫర్మాన్ను ఆలయంలో వివాహం చేసుకుంది. కుటుంబ అభ్యంతరాల మధ్య జరిగిన ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివాహ సమయంలో మోనాలిసాకు తాళి కడుతున్న దృశ్యం
Viral Kumbh Mela Girl Monalisa Marries Muslim Boyfriend in Kerala Temple
మహాకుంభమేళా సందర్భంగా రుద్రాక్ష మాలలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా భోస్లే కేరళంలో తన బాయ్ఫ్రెండ్ ముహమ్మద్ ఫార్మాన్ను ఆలయంలో వివాహం చేసుకుంది. కుటుంబ అభ్యంతరాల మధ్య జరిగిన ఈ పెళ్లి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మోనాలిసా సినిమాలు, మ్యూజిక్ వీడియోల ద్వారా సినీ రంగంలో అవకాశాలు పొందుతోంది.
విధాత వైరల్ డెస్క్ | 11 మార్చి 2026 | హైదరాబాద్:
మహాకుంభమేళా సందర్భంగా రుద్రాక్ష మాలలు అమ్ముతూ సోషల్ మీడియా వీడియోలతో ఒక్కసారిగా వైరల్ అయిన యువతి మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. కుటుంబ తీవ్రఅభ్యంతరాల మధ్య తన బాయ్ఫ్రెండ్ ముహమ్మద్ ఫర్మాన్ను కేరళంలోని ఒక ఆలయంలో వివాహం చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బుధవారం తిరువనంతపురం సమీపంలోని అరుమానూర్ ఆలయంలో ఈ వివాహం జరిగింది. పెళ్లి వేడుకకు స్థానిక ప్రజలు, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎరుపు రంగు చీరలో మోనాలిసా మెరిసిపోగా, వరుడు ఫర్మాన్ తెల్ల చొక్కా, ముండు ధరించి కనిపించాడు. ఆలయ పూజారి ఇచ్చిన తాళిని కట్టి, పాపిట సింధూరం పెట్టడంతో వివాహం పూర్తయింది. అనంతరం దంపతులు ఆలయంలో దేవుడిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
కుటుంబ అభ్యంతరాల మధ్య నిర్ణయం

సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఫోటోషూట్లో మోనాలిసా
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా, మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఇద్దరూ ఫేస్బుక్ ద్వారా పరిచయమై ముందు స్నేహం తరువాత ప్రేమగా మారి, కొంతకాలంగా ఇద్దరూ సంబంధంలో ఉన్నట్లు సమాచారం. ఈ సంబంధానికి మోనాలిసా కుటుంబం అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. తన తండ్రి తాను ఇష్టపడని వ్యక్తితో పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు మోనాలిసా తిరువనంతపురం తంపనూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఆమె వయసును పరిశీలించి ఆమె 18 సంవత్సరాలు పూర్తయిందని నిర్ధారించి, తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఉందని కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. అనంతరం మోనాలిసా తన ప్రేమికుడిని ఆలయంలో వివాహం చేసుకుంది.
కుంభమేళాతో వచ్చిన గుర్తింపు

కుంభమేళాతో వైరల్ అయిన మోనాలిసా… అప్పుడూ, ఇప్పుడూ..
2025లో జరిగిన మహాకుంభమేళా సందర్భంగా మోనాలిసా రుద్రాక్ష మాలలు అమ్ముతూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆమె ప్రత్యేకమైన కళ్ళు, చిరునవ్వు నెటిజన్లను ఆకర్షించాయి. దీంతో ఆమె ఒక్కసారిగా ఇంటర్నెట్ సంచలనంగా మారింది.

సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత దర్శకుడితో మోనాలిసా
ఆ గుర్తింపుతో ఆమెకు సినీ అవకాశాలు కూడా లభించాయి. త్వరలో విడుదల కానున్న “ది డైరీ ఆఫ్ మణిపూర్” అనే బాలీవుడ్ సినిమాలో ఆమె నటిస్తోంది. ప్రస్తుతం మలయాళ చిత్రం “నాగమ్మ”లో కూడా నటిస్తూ కేరళంలో షూటింగ్లో పాల్గొంటోంది. టాలీవుడ్ లో సాయి చరణ్ హీరోగా ‘లైఫ్’ అనే తెలుగు సినిమాలో కూడా మోనాలిసా హీరోయిన్ గా నటిస్తోంది.
సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, సోషల్ మీడియా ద్వారా మోనాలిసా తన కెరీర్ను ముందుకు తీసుకెళ్తోంది. కుంభమేళా వద్ద మాలలు అమ్మే సాధారణ యువతిగా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు సినీ రంగం వరకు చేరడం విశేషంగా మారింది. అనుకోని ఈ కొత్తమలుపు ఆమె జీవితాన్ని ఎటువేపు తీసుకెళ్తుందో చూడాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram