విధాత : యువతీయువకులు 20ఏళ్లకే పెళ్లి చేసుకొని.. పిల్లల్ని కనాలని జోహో సీఈవో శ్రీధర్ వెంబు సూచించారు. తనను కలిసి చాలా మంది యువతకు ఇదే సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. 20ఏళ్లలోనే పెళ్లి చేసుకోవడం ద్వారా మన పెద్దలు, సమాజం పట్ల ఉన్న బాధ్యతను పూర్తిచేయాలని సూచించారు.
తమిళనాడుకు చెందిన సాధారణ కుటుంబంలో జన్మించిన శ్రీధర్ వెంబు.. ఐఐటీ, మద్రాస్లో ఉన్నత విద్య అభ్యసించారు. అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన సిలికాన్ వ్యాలీలో జోహో కార్పోరేషన్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించి..దానికి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. దాదాపుగా వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతియైన ఆయన.. అకస్మాత్తుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలేసి స్వగ్రామానికి వచ్చేశారు. తన మాథాలంపరై గ్రామంలో సైకిల్పై తిరుగుతూ..గ్రామస్తులతో కలిసి సాదాసీదా జీవనం గడుపుతున్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం, ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
