రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు
గతంలో కాంగ్రెస్ను బలహీనపర్చిన కేసీఆర్
ప్రత్యామ్నాయం లేక బీజేపీలోకి వెళ్లిన నేతలు
బీఆరెస్ బలహీనపడితే.. కాషాయ నేతలకే లాభం
కేసీఆర్ చేసిన తప్పు కాంగ్రెస్ చేస్తుందా?
తెలంగాణలో పూర్వవైభవానికి టీడీపీ యత్నాలు
బీజేపీ, జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ?
(విధాత ప్రత్యేకం)
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అలాంటి ప్రయత్నం చేయమని, కానీ అవతలి పక్షం నుంచి అలాంటి యత్నాలు ఏవైనా జరిగితే అది ఎక్కడిదాకా వెళ్తుందో చెప్పలేమన్నారు. రేవంత్ ప్రభుత్వ మనుగడకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. కానీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవాల్సి వస్తున్నదనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో 90 శాతానికి పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఒకరిద్దరు తమ వ్యక్తిగత చరిష్మాతో పాటు ప్రజల్లోనే ఉండటం ద్వారా గెలువగలిగారు.
ఫిరాయింపు రాజకీయాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పొరపాట్లనే రేవంత్ సర్కార్ చేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలను చేర్చుకోగా.. రానున్న రోజుల్లో మరికొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారనే వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధాన పార్టీలు ఒక విషయాన్ని మరిచిపోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు, మొన్నటి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బలమైన ప్రతిపక్షం ఉండాలన్నది ప్రజల తీర్పులో స్పష్టంగా కనిపించింది.
ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పార్టీల్లో చీలిక తెస్తామని ఏ రాజకీయపార్టీ భావించినా దానికి ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గత నిదర్శనాలు ఉన్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మొదట శివసేనలో చీలిక తీసుకొచ్చింది. అంతటితో ఆగకుండా ఎన్సీపీలోనూ చీలిక తెచ్చింది. తాను చీలిక తెచ్చి, కాషాయ కూటమిలో కలుపుకొన్న పార్టీలే అసలైనవని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ చెప్పారు. కానీ ప్రజల తీర్పు దానికి విరుద్ధంగా వచ్చింది. ఈ విషయాలను చూసిన తర్వాత అయినా రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఫిరాయింపు రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలన్నది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను కూల్చేస్తామని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి బీజేపీకి సొంతగా మెజార్టీ దక్కలేదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రయత్నాలను తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ విషయంలో బీజేపీ అజెండాగానీ, మోడీ, షాల వైఖరిగానీ మారుతుందని భావించనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూ కీలకంగా ఉన్నాయి. కనుక ఇక్కడి రేవంత్ ప్రభుత్వాన్ని మోదీ కూల్చకుండా అడ్డుకుంటారనే అభిప్రాయం ఉన్నది.
అయితే చంద్రబాబు ప్రస్తుతం ఏపీ ప్రయోజనాలు, ఆ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి రాబట్టడం వంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. మరోవైపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలోనూ టీడీపీ పోటీ చేయాలని యోచిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖమ్మం జిల్లా పార్టీ నేతల సమావేశానికి వెళ్లిన చంద్రబాబు ఇక్కడి నుంచే పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని వ్యాఖ్యానించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినా ఇక్కడ కొన్ని సీట్లు సాధించడం కంటే ఏపీలో అధికారంలోకి రావడమే ముఖ్యమని అనుకున్నారు. అందుకే పోటీకి దూరంగా ఉన్నారు. కానీ తెలంగాణలో తన పార్టీ జెండాను పీకేయాలనే ఆలోచన ఆయనలో లేదన్నది స్పష్టంగా కనిపిస్తున్నదని చెబుతున్నారు.
బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టీడీపీలో చేరనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయనకే రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారన్నది ఆ వార్తల సారాంశం. దాన్ని మల్లారెడ్డి ఖండించినా ఒకవేళ రానున్న రోజుల్లో ఒకవేళ అలాంటి పరిణామాలు జరిగితే చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారనే అంశంలో స్పష్టత వస్తుంది. అలాంటి ప్రయత్నం జరిగితే టీడీపీ ఏపీలో వలె (టీడీపీ, జనసేన, బీజేపీ) కూటమిలా ఇక్కడ కూడా అదే రిపీట్ చేసే అవకాశం ఉన్నది. అక్కడ టీడీపీ ఎక్కువ సీట్లు తీసుకున్నట్టు ఇక్కడ బీజేపీ ఎక్కువ సీట్ల తీసుకోవచ్చు.
ఖమ్మం, హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ను బలహీనపరిస్తే అది అంతిమంగా బీజేపీకి అవకాశంగా మారుతుందని పలువురు చెబుతున్నారు. గతంలో రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని భావించిన కేసీఆర్.. కాంగ్రెస్ను బలహీనపర్చారు. కానీ.. ఆ గ్యాప్ను బీజేపీ భర్తీ చేసింది. అంతేకాదు.. అదే బీఆరెస్ను మింగుతూ రెండో బలమైన పార్టీగా ఎదుగుతున్నది. ఈ నేపథ్యంలో అదే తప్పిదాన్ని కాంగ్రెస్ చేస్తే.. అది అంతిమంగా బీజేపీకే లబ్ధి చేకూర్చుతుందని ప్రగతిశీల శక్తులు హెచ్చరిస్తున్నాయి.