విధాత: బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి నాకు మాత్రమే దక్కిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడలో ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నానని, నా పదవీ విరమణ రోజు కూడా ఇదే రోజు కావడం విశేషమన్నారు.
ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని… సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చిందన్నారు. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నానన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానని.. ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, పోస్టింగ్ ఆర్డర్లు రావడంతో విధుల్లో చేరానని, సాయంత్రం పదవి విరమణ ఉంటుందని, ఇప్పటికి ఇంత వరకు మాత్రమే మాట్లాడాలన్నారు. ఇంతకాలం నాకు అండగా ఉండి దైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని పేర్కోన్నారు.
నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యావాదాలని, యూనిఫాంతో పదవీ విరమణ చేయాలనుకున్న నా కల నెర వేరినట్లుగా భావిస్తున్నానని అని ఏబీవీ తెలిపారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఎత్తివేసి, రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ కమిషనర్ ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఆయనకు ఇదే రోజు పదవి విరమణ కావడంతో తనకిచ్చిన పోస్టింగ్లో ఉదయం జాయిన్ అయినా ఏవీబీ సాయంత్రం రిటైరవ్వడం విశేషం.