జనసేనలో చేరిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. కండువా కప్పిన పవన్ కళ్యాణ్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బుధవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు

విధాత: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బుధవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. జానీమాస్టర్ స్వస్థలం నెల్లూరు. కొరియోగ్రాఫర్ గా ఆయన తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో మంచి పేరు సంపాదించుకున్నారు. పవన్ కు వీరాభిమాని కూడా అయిన జానీ మాస్టర్ పార్టీలో చేరడంతో జనసైనికుల్లో ఉత్సాహం ఊపందుకుంది. ఇటీవల జానీమాస్టర్ నెల్లూరులో అంగన్ వాడీలు చేపట్టిన నిరసనకు మద్దతు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన అడుగులు రాజకీయాల వైపు పడుతున్నాయన్న సంకేతాలిస్తున్నట్లు అభిమానులు చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే కాపునేత హరిరామ జోగయ్యను కలిసి చర్చలు చేయడం, నెల్లూరు జిల్లా జనసేన నేతలతో తరచూ టచ్ లో ఉండడం పట్ల జానీమాస్టర్ రాజకీయ ప్రవేశానికి అడుగులు పడుతున్నట్లు చర్చ జరిగింది. కాగా జానీ మాస్టర్ జనసేనలో చేరుతున్నారని ఇటు సినీ వర్గాలు, అటు రాజకీయ వర్గాల్లో కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఆయన చేరికతో ఫుల్ స్టాప్ పెట్టినట్లయ్యింది. జానీ మాస్టర్ కు పవన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో ఇతను జనసేన నుంచి పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది.