ఏపీలో టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలవనుండటం..కేంద్రంలో ఇండియా కూటమి అధికార సాధనకు చేరువగా వచ్చే సీట్లు గెలిచే పరిస్థితి నెలకొనడంతో ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు గాలం వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.
విధాత, హైదరాబాద్ : ఏపీలో టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలవనుండటం..కేంద్రంలో ఇండియా కూటమి అధికార సాధనకు చేరువగా వచ్చే సీట్లు గెలిచే పరిస్థితి నెలకొనడంతో ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు గాలం వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఏపీలో ఘన విజయాలు అందుకున్న చంద్రబాబు మద్ధతు సాధించేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చంద్రబాబుతో సంప్రదింపులు చేసినట్లుగా ప్రచారం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
చంద్రబాబుతో పాటు బీహార్లో నితీశ్కుమార్ను తమవైపు తిప్పుకుంటే ఢిల్లీ పీఠం ఎక్కే అవకాశాలు మెరుగవుతాయని కాంగ్రెస్ వ్యూహారచన చేస్తుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్తో టీడీపీ కలిసి పనిచేసిన నేపథ్యం కూడా ఉండటంతో..చంద్రబాబు కాంగ్రెస్ ఇచ్చే ఆఫర్కు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ గత సంకీర్ణాల పనితీరు భేరీజు నేపథ్యంలో చంద్రబాబు ఎన్డీఏ కూటమితోనే కొనసాగవచ్చని, బీజేపీ ఎలాగూ కేంద్రంలో సింగిల్ లార్జెస్టు పార్టీగా నిలవనున్న క్రమంలో ఆ పార్టీ ప్రభుత్వంతోనే బాబు ముందుకెళ్లవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు