Site icon vidhaatha

Pawan Kalyan | పంచాయతీరాజ్‌ శాఖ అవినీతిపై కమిషన్‌ .. మండలిలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

విధాత, హైదరాబాద్ : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖలో జరిగిన అవినీతి పై కమిషన్ వేసే ఆలోచనలో ఉన్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖలో ఎంత మేరకు అవినీతి జరిగిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా రాష్ట్ర పంచాయతీలకు వచ్చి విచారణ చేస్తారని తెలిపారు. కేంద్రం నుంచి సమయానికి నిధులు రాష్ట్రానికి వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం ఐదుసార్లు పంచాయతీకి నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు పెనాల్టీ కేంద్రానికి కట్టిందన్నారు. పంచాయతీ సర్పంచ్‌ల అనుమతి లేకుండా రూ. 2165 కోట్ల నిధులు డిస్కంలకు గత ప్రభుత్వం కట్టిందన్నారు. పంచాయతీకి సంబంధించిన నిధులు పంచాయతీలకే వాడాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 9098 కోట్ల నిధులు మార్చికల్లా పంచాయతీలకు విడుదల కావాల్సి ఉండగా ఇంకా నిధులు విడుదల కాలేదని నిధులు విడుదలకు సంబంధించి అధికారులతో కూర్చుని చర్చిస్తామన్నారు. రూ.7518 కోట్లు ఇప్పటిదాకా ఎనిమిదిసార్లు పంచాయతీ రాజ్ సంస్థలకు విడుదల చేయడం జరిగిందని, కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులు పంచాయతీలకు ఎప్పుడు ఆలస్యంగానే వెళ్లాయని గుర్తించామన్నారు.

Exit mobile version