Kethireddy Pedda Reddy Vs Police : తాడిపత్రిలో టెన్షన్..పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

తాడిపత్రిలో పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. జేసీ అస్మిత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు, ఆరోపణలకు సమాధానం ఇచ్చారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Nov 12, 2025, 1:18 pm IST
Read Time: 4 mins
Kethireddy Pedda Reddy Vs Police : తాడిపత్రిలో టెన్షన్..పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

అమరావతి : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ పార్టీ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహణకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీ కార్యక్రమాన్ని మరో చోటికి మార్చుకోవాలని పోలీసులు పెద్దారెడ్డికి సూచించారు. ముందుగా అనుమతి ఇచ్చి ఇప్పుడు అడ్డుకోవడం ఏమిటని పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నందునా..ర్యాలీ కార్యక్రమాన్ని మరోచోటికి మార్చుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. పెద్దారెడ్డిని ఇంటి నుంచి కదలనివ్వకుండా అక్కడే మోహరించారు. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి గ్యాంగ్‌స్టర్లుగా వ్యవహరిస్తున్నారని, తాను ఎక్కడికి వెళ్లినా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ చేస్తానని వారంటున్న మాటలకు అవకాశం వస్తే నేనంటే ఏంటో చూపిస్తానంటూ హెచ్చరించారు. పోలీసులు, అధికారులు జేసీ కుటుంబానికి తొత్తులుగా వ్యవహరించడం సమంజసంగా లేదన్నారు.

ఐదేళ్ల పీడను వదిలించేందుకు ప్రయత్నిస్తున్నాం : జేసీ అస్మిత్ రెడ్డి

తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దారెడ్డిని తాము అడ్డుకుంటున్నామన్న ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కొట్టిపారేశారు. ఎవరిని అడ్డుకుంటున్నాం?.. గత ఐదేళ్లు పట్టిన పీడను వదిలించుకుని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే తప్పేంటి..? అని ప్రశ్నించారు. ఈ రోజు తాను నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నామని, పెద్దారెడ్డి ఏం చేయకుండా ఐదేళ్లు నియోజకవర్గం వెనుకబాటుకు కారణమయ్యాడని విమర్శించారు. మేం పెద్దారెడ్డిని అడ్డుకోవడం లేదని, ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రత చర్యలు చేపట్టారన్నారు.