విధాత, హైదరాబాద్ : నిమ్మకాయ అకస్మాత్తుగా పైకి లేచింది. రైతన్నలకు లాభలు అందిస్తుంది. నిన్న మొన్నటి వరకు గిట్టుబాటు ధరలు లేక నష్టాల పాలయిన నిమ్మ తోటల రైతులకు ఇప్పుడు నిమ్మ ధరలు పైకి లేవడంతో భారీ ఊరట దక్కుతుంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్లో నిమ్మ రికార్డు స్థాయి ధరలు పలకడం రైతన్నల కష్టానికి తగిన ప్రతిఫలంగా మారింది. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా 80 కిలోల బస్తా ఏకంగా రూ.10 వేల రూపాయల వరకు పలకడం విశేషం.
పదేళ్ల కాలంలో నిమ్మ ఇంత ధర పలికిన దాఖలాలు లేవని రైతులు వ్యాపారులు చెబుతున్నారు. మార్చి రెండవ వారం వరకు గిట్టుబాటు ధరలు లేక తల్లడిల్లిన నిమ్మ రైతులకు.. జనవరిలో కనీస ధర కూడా దక్కలేదు. దీంతో రైతులు నష్టపోకూడదని ప్రభుత్వ ఆదేశాలతో అక్కడి కలెక్టర్ మార్కెటింగ్ శాఖ ద్వారా కిలో రూ. 8 కి కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు తరలించారు. తాజాగా కిలో రూ.125 వరకు విక్రయించారు.
నిమ్మ ధరల పెరుగుదలపై మంత్రి అచ్చెన్నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. నిన్నటి వరకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను మా ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా గత జనవరిలో మార్కెట్ పడిపోయినప్పుడు రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ నేతృత్వంలో మార్కెటింగ్ శాఖ ద్వారా కిలో 8 రూపాయలకు కొనుగోలు చేసి ఆదుకున్నాం అని గుర్తు చేశారు. ఆనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నేడు మారిన పరిస్థితుల వల్ల మార్కెట్లో తాజాగా కిలో 125 రూపాయల వరకు ధర పలుకుతోందని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
