Site icon vidhaatha

తెలంగాణ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మేం అలా కాదు : అనిల్

విధాత,అమరావతి : తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిపై ఏపీ ప్రభుత్వం మరోమారు నిప్పులు చెరిగింది. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం సక్రమమే అని, తెలంగాణ ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తోందని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఆక్షేపించారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న నీటిపారుదల సమస్యను సామరస్యంగా పరిష్కరించరించేందుకు కృషి చేస్తున్న సమయంలోనే, తెలంగాణ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం బాగోలేదని అనిల్ తీవ్రంగా మండిపడ్డారు.

వైస్సార్‌పై కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ మాటలను తెలంగాణ మంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తమ నాయకుడిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతున్నారని, తామూ అలా మాట్లాడగలమని, అయితే సామరస్యంగా పరిష్కరించుకుందామని సీఎం అన్నందుకే అలా మాట్లాడటం లేదని వివరించారు. పోతిరెడ్డిపాడును వెడల్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, ఏపీ హక్కుగా ఎన్ని నీళ్లను వాడుకోవాలో, అంత నీటిని కచ్చితంగా వాడుకుంటామని స్పష్టం చేశారు.

తాము అక్రమంగా ఏ ప్రాజెక్టులూ నిర్మించడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. పాలమూరు డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులు కూడా అక్రమంగా కట్టారని, ఆనాడు టీడీపీ ప్రభుత్వం వాటిని అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. జల సమస్యలన్నీ సామరస్యంగానే పరిష్కరించుకుంటామని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

Exit mobile version