Vijayanand | ఏపీ సీఎస్గా కావేటి విజయానంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా కే.విజయానంద్ పేరు పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది

కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ల పోస్టింగ్లలో భారీ మార్పులు
విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా కే.విజయానంద్ పేరు పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ లలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పదవీకాలం జూన్ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త సీఎస్ గా విజయానంద్ నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గా, ఏపీ ట్రాన్స్ కో , ఏపీ జెన్ కో సీఎండీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటీ మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శి (ప్రిన్సిపల్ సెక్రెటరీ)గా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.