MP Appalanaidu | సైకిల్‌పైనే పార్లమెంటుకు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్‌పైనే పార్లమెంటు సమావేశాలకు హాజరవుతూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. ఢిల్లీలో నివాసం ఉంటున్న అతిథి గృహం నుంచి సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్‌కు వెళ్లారు.

Reported by: Somu | ఆంధ్ర ప్రదేశ్ | Jul 24, 2024, 1:46 pm IST
Read Time: 3 mins
MP Appalanaidu | సైకిల్‌పైనే పార్లమెంటుకు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి

విధాత, హైదరాబాద్ : విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్‌పైనే పార్లమెంటు సమావేశాలకు హాజరవుతూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. ఢిల్లీలో నివాసం ఉంటున్న అతిథి గృహం నుంచి సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్‌కు వెళ్లారు. ముందుగా తన తల్లికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి పార్లమెంటుకు వెళ్లారు. ప్రభుత్వం కారు కేటాయించినా.. సైకిల్ మీదే పార్లమెంట్‌కు వెళ్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యవహారశైలీ చర్చనీయాంశమైంది. కాగా ఢిల్లీలోని జంతర మంతర్ వద్ధ టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ ధర్నా చేయడాన్ని ఈ సందర్భంగా అప్పలనాయుడు తప్పుబట్టారు. చంద్రబాబు సారధ్యంలో ఏపీ పునర్ నిర్మాణం జరుగుతుందని, బడ్జెట్‌లో సైం ఆశించిన నిధులు దక్కాయని ఏపీ ప్రజలు సంబరపడుతుంటే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిపక్ష పాత్రను నిర్మాణాత్మకంగా పోషించి జగన్ మంచి సూచనలు చేస్తే స్వాగతిస్తారన్నారు. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అసెంబ్లీ చర్చించాలని, సమస్యలు ఏవైనా ఉంటే గుర్తించి మంచి సూచనలు ఇవ్వాలన్నారు. డివైడర్ ఢీ కొట్టి చనిపోతే కూడా రాజకీయ హత్య అంటున్నారని, టీడీపీకి కక్షసాధింపు ఆలోచన అన్నదే లేదని.. ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రం ఇబ్బందులో ఉందని, సూచనలిచ్చి సహకరించాలన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో మంచి పనులు చేస్తే అభినందించిన సందర్భాలున్నాయని.. జగన్ అభినందించకపోయినా ఫరవాలేదు.. కానీ రాష్ట్ర పరువు తీసే పనులు చేయవద్దని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సూచించారు.