Site icon vidhaatha

Visakha MLC elections | ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రసవత్తర ఘట్టం

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి బొత్స నామినేషన్‌
రంగంలోకి ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి

విధాత, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రసవత్తర ఘట్టం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో సోమవారం తొలి నామినేషన్ దాఖలైంది. వైసీపీ పార్టీ అభ్యర్థిగా గెలుపుకు అవసరమైన సంఖ్యాబలమున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట బొత్స ఝాన్సీ, ఎంపీ తనుజారాణి ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు చేశారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను ఢీ కొట్టనున్నారు. ఈ నెల 30వ తేదీన ఎన్నిక జరుగనుంది. కాగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పోటీ పట్ల బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టు భావించాలని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

స్థానిక సంస్థలలో వైసీపీకి 530కి పైగా ఓట్లు బలం ఉందని.. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని వైసీపీ కోరుకుంటోందన్నారు. స్పష్టమైన మెజారిటీ వైసీపీకి ఉన్నప్పుడు టీడీపీ పోటీ ఎందుకు పెడుతోందని ప్రశ్నించారు. ఎవరో బిజినెస్ మ్యాన్‌ను తీసుకుని వచ్చి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోందని,. రాజకీయాలు అంటే వ్యాపారమా అంటూ ప్రశ్నలు గుప్పించారు. స్వల్ప తేడా ఉందంటే పోటీ పెట్టడం సరైనదే కానీ 300 ఓట్లు తేడా వున్నప్పుడు కూటమి పోటీకి దిగడం ఎలా చూడాలన్నారు. క్యాంపు రాజకీయాలు పెట్టడానికి అసలు ఉద్దేశం దుష్టులకు దూరంగా తమ స్థానిక ఓటర్లను ఉంచడం కోసమేనని స్పష్టం చేశారు. మాకు బలం వుంది కాబట్టే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో పోటీకి వెళ్లామన్నారు. ఇప్పటికే రాజకీయాలు పలుచన అయ్యాయని… ప్రజల ముందు మరింత పలుచని కావొద్దని కూటమి నేతలకు సూచిస్తున్నానన్నారు. మిగతా వాళ్లతో పోలిస్తే విశాఖకు ఎవరు దగ్గరైన వ్యక్తినో ప్రజలు చెప్పాలన్నారు.

Exit mobile version