AP Legislative Council| యూరియాపై చర్చకు శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం
ఏపీ శాసన మండలిలో యూరియా కొరతతో పాటు పంటలకు గిట్టుబాటు ధర, ఇతర రైతాంగ సమస్యలపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ(AP assembly) శాసన మండలి(Legislative Council) సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. శాసన మండలిలో యూరియా కొరతతో(Urea Shortage) పాటు పంటలకు గిట్టుబాటు ధర, ఇతర రైతాంగ సమస్యలపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ( YSRCP) ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం(adjournment motion) ఇచ్చారు. వైసీసీ ఎమ్మెల్సీ లు తోట త్రిమూర్తులు, రామసుబ్బారెడ్డి, శివరామరెడ్డి యూరియా కొరతపై చర్చించాలంటూ వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. వైసీపీ సీనియర్ సభ్యులైన బొత్స సత్యనారాయణ సమస్య తీవ్రత నేపథ్యంలో తక్షణమే చర్చ చేపట్టాలన్నారు. చైర్మన్ వారిస్తున్నా, చర్చకు సమయం ఉందని తెలిపినా వైసీపీ సభ్యులు పట్టించుకోకుండా సభలో రభస చేయడంతో సభను కాసేపు వాయిదా వేశారు.
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులు, యూరియా సమస్యలపై మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం.. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తోంది.. అన్ని విషయాలపై చర్చిస్తాం.. కాస్త సమయం ఇవ్వండన్నారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల అంశం కొనసాగించారు.