ప్రస్తుతం టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి నెలకొనడం మనం చూస్తూనే ఉన్నాం. నవంబర్లో వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కగా, రీసెంట్గా దగ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడయ్యాడు. డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది. తన కుటుంబానికి అత్యంత దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకోగా, వారి వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకను నిర్వహించగా, ఇప్పుడిప్పుడే పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
అభిరామ్ పెళ్లి తర్వాత ఒకటే ఫొటో బయటకు వచ్చింది. అందులో నూతన దంపతులతో పాటు దగ్గుబాటి సురేష్ ఫ్యామిలీ ఉంది. తాజాగా మరో ఫొటో బయటకు రాగా, ఇందులో సురేష్ బాబు, ఆయన భార్య, వెంకటేష్, ఆయన భార్య, వెంకటేష్ పిల్లలు, భార్యతో రానా, నాగచైతన్య, మరికొంతమంది కుటుంబ సభ్యులు.. ఇలా దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం అందరు కూడా పిక్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్గా మారింది. పెళ్లి వేడుక అయ్యాక తన సతీమణితో కలిసి అభిరామ్ ఎయిర్పోర్ట్లో కనిపించగా, అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
పెళ్లిని చాలా సైలెంట్గా నిర్వహించిన దగ్గుబాటి ఫ్యామిలీ మరి కొద్ది రోజులలో సినీ ప్రముఖుల సమక్షంలో భారీ ఎత్తున రిసెప్షన్ జరుపుతారని అనుకున్నారు. కాని అది ఉండదు అని ఇన్సైడ్ టాక్. శ్రీరెడ్డి వ్యవహారం వల్లనే దగ్గుబాటి ఫ్యామిలీ కాస్త సైలెంట్ అయి ఉంటారని కొందరు భావిస్తున్నారు. ఇక దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘అహింస’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పరాజయం పాలైంది. కొంత గ్యాప్ తర్వాత రెండో సినిమా చేసే అవకాశం ఉండగా, ఆయన ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.కాగా, అభిరామ్ సోదరుడు రానా మంచి సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే.