Viral News | వరల్డ్ కప్లో భాగంగా నిన్న అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడిన విషయం విదితమే. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. అన్ని వికెట్లను కోల్పోయి 191 పరుగులను భారత్కు లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి, విజయాన్ని ముద్దాడింది. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ మ్యాచ్ను టీమిండియా ప్రేక్షకులు తిలకిస్తూ.. పలు ఆహార పదార్థాలను ఆన్లైన్లో ఆర్డర్ చేశారు.
చండీఘర్కు చెందిన ఓ కుటుంబం ఈ మ్యాచ్ సందర్భంగా 70 బిర్యానీలను ఆర్డర్ చేసింది. అంటే కేవలం ఆరేడు గంటల్లోనే 70 బిర్యానీలను ఆర్డర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయాన్ని స్విగ్గీ ఎక్స్లో వెల్లడించింది. స్విగ్గీ ట్వీట్పై నెటిజన్లు పలురకాలుగా స్పందించారు.
దీన్నే మార్కెటింగ్ స్ట్రాటజీ అని అంటారని ఓ యూజర్ పేర్కొన్నాడు. తాను కూడా మ్యాచ్ చూస్తూ 86 వడపావ్స్ను స్విగ్గిలో ఆర్డర్ చేశానని మరో నెటిజన్ తెలిపాడు. ఇదంతా ఒక పార్టీ మూడ్ అని మరొకరు రాసుకొచ్చారు.
నెల రోజుల క్రితం ఆసియా కప్లో భాగంగా శ్రీలంక వేదికగా జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కూడా.. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి 62 బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ పేర్కొన్న విషయం తెలిసిందే.