Diabetes | భారతదేశంలో రోజురోజుకు డయాబెటిస్తో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తీవ్రమైన ఒత్తిళ్లు, మానసిక ప్రశాంతత లేకపోవడం, చక్కెర స్థాయిలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం కారణంగా మధుమేహం బారిన పడుతున్నారు. మరి మధుమేహ మహమ్మారిని ఎదుర్కోనేందుకు ఆరోగ్యకరమైన, మరింత సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అయితే పురాతన కాలంలో విరివిగా ఉపయోగించిన ఈ చిరు ధాన్యంతో డయాబెటిస్కు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిరు ధాన్యం ఏంటంటే రాగులు.
ఈ రాగులను సైన్స్ భాషలో ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో రాగులు విరివిగా లభిస్తాయి. ఈ చిరు ధాన్యంలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం అధిక స్థాయిలో నిక్షిప్తమై ఉంటాయి. రాగులను ఆహార రూపంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. రాగుల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ రేటును కూడా తగ్గిస్తుంది. ఫలితంగా చక్కెర రక్త ప్రవాహంలోకి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా విడుదల అవుతుంది. ఆకస్మిక చక్కెర స్థాయిల పెరుగుదలను నియంత్రిస్తుంది. తద్వారా మధుమేహాన్ని కంట్రోల్ను చేస్తుంది. అంతేకాకుండా రాగిలో ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతోపాటు, మధుమేహంతోపాటు అనేక ఇతర వ్యాధులతో పోరాటంలో సహాయపడతాయి.
రాగులను పిండిగా చేసి రొట్టెలను తయారు చేసుకొని తినొచ్చు. అంబలిగా కూడా ప్రిపేర్ చేసి, అల్పాహారంగా తీసుకోవచ్చు. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎముకలు గట్టి పడుతాయి కూడా. శరీరానికి కావాల్సినంత ఐరన్ కూడా లభిస్తుంది. ప్రస్తుత ఆహారపు అలవాట్లతో అనేక మంది అనేక రోగాలకు గురవుతున్నారు. కాబట్టి పురాతన కాలపు ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. దీంతో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.