అమెరికాలో ఖమ్మం విద్యార్థికి కత్తిపోట్లు.. పరిస్థితి విషమం

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఖమ్మం విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్ రాజ్(24) ఇండియానా రాష్ట్రంలో ఎంఎస్ చదువుతున్నాడు. అయితే మంగళవారం జిమ్కు వెళ్లాడు వరుణ్. జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా, ఓ దుండగుడు కత్తితో వరుణ్ కణితిపై బలంగా పొడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వరుణ్ బతికే ఛాన్స్ 5 శాతం మాత్రమే ఉందని వైద్యులు తెలిపారు. వరుణ్పై దాడి చేసిన దుండగుడిని జోర్డాన్ ఆండ్రాడ్గా గుర్తించారు. అయితే దాడికి గల కారణాల గురించి అధికారులు విచారిస్తున్నారు. హత్యాయత్నం కింద కేసు బుక్ చేశారు.
వరుణ్ తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. రామ్మూర్తి మంగళవారం రాత్రి మంత్రి పువ్వాడ అజయ్ను కలిసి తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని కోరారు.