ముంబై ఇండియన్స్పై ఢిల్లీ ఘన విజయం..చరిత్ర సృష్టించిన క్యాపిటల్స్ జట్టు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయ యాత్ర అప్రతిహతంగా సాగుతుంది. వరుస విజయాలతో టేబుల్ టాప్లోకి దూసుకుపోతుంది. మంగళవారం ఈ జట్టు ముంబై ఇండియన్స్తో పోటీ పడగా, ఈ మ్యాచ్లో 29 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(33 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 69 నాటౌట్), మెగ్ లాన్నింగ్(38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఢిల్లీ జట్టు భారీ స్కోరు సాధించింది.
ఇక భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 163 పరుగులే మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటర్లు ముందు నుండే హిట్టింగ్ చేయడంతో త్వరత్వరగా వికెట్స్ కోల్పోవలసి వచ్చింది. అయితే అమన్జోత్ కౌర్(27 బంతుల్లో 7 ఫోర్లతో 42), హీలీ మాథ్యూస్(17 బంతుల్లో 6 ఫోర్లతో 29) మోస్తరు స్కోరు చేయడంతో ముంబై జట్టు కనీసం 163 పరుగులు అయిన చేయగలిగింది. యస్తికా భాటియా(6), నాట్ సివర్ బ్రంట్(5), హర్మన్ప్రీత్ కౌర్(6) ఈ మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచారు.ఢిల్లీ బౌలర్లలో జెస్ జోనాస్సెన్(3/21) మూడు వికెట్లు తీయగా.. మరిజన్నే కాప్(2/37) రెండు వికెట్లు , శిఖా పాండే, టిటాస్ సధు, రాధా యాదవ్ తలో వికెట్ తీసి ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించారు.
ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో విజయం సాధించగా, ముంబైకి రెండో పరాజయం. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది.కొద్ది రోజుల క్రితం ఇదే ముంబై ఇండియన్స్ చేతిలో 4 వికెట్లతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత సంచలన ప్రదర్శన చేస్తూ వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసి టేబుల్ లో మొదటి స్థానానికి చేరింది. యూపీ వారియర్స్ను 9 వికెట్లతో ఓడించిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్పై గెలిచింది. ఇక తాజా మ్యాచ్లో 29 పరుగులతో ముంబైని ఓడించి టాప్కి వెళ్లింది. మరి రానున్న రోజులలో వారి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.