హిందూ మతంలో లక్ష్మీదేవిని సిరిసంపదలకు అధి దేవతగా పరిగణిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవిని కర్పూరంతో పూజిస్తే.. కర్మలన్నీ తొలగిపోయి, అష్టైశ్వర్యాలు తులతూగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారు ప్రధానంగా కర్పూర పూజ చేయాలని సూచిస్తున్నారు.
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు శుక్రవారం ఉదయాన్ని తలస్నానం చేసి.. లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఆ తర్వాత ఐదు కర్పూరం బిల్లలను తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టాలి. ఆ మూటను లక్ష్మీదేవి ముందు ఉంచి, అగర్బత్తితో ధూపం వేయాలి. ఇక తమ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించాలి. ఆ తర్వాత కర్పూరాలతో లక్ష్మీదేవికి పూజ చేయాలి.
ఈ పూజ ముగిసిన అనంతరం.. కర్పూరాలతో ఉన్న మూటను బీరువాలో డబ్బు, బంగారాన్ని ఉంచిన ప్రదేశంలో ఉంచాలి. ఇలా ఉంచితే ఆర్థిక ఇబ్బందులే కాకుండా, కర్మలన్నీ తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు తులతూగడం ఖాయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సాయంత్రం వేళ తులసి మొక్కను పూజించండి..
తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా శుభప్రదం. ఈ మొక్కలో లక్ష్మీదేవి, శ్రీ మహా విష్ణువు నివసిస్తారని నమ్మకం. అందుకే ఈ మొక్క చాలా పవిత్రమైనది. పూజ్యమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి కర్పూరంతో పాటు సాయంత్రం తులసి మొక్కను పూజించడం ద్వారా లక్ష్మీ దేవి ప్రసన్నురాలవుతుందని.. ఆమె అనుగ్రహం వల్ల ఇంట్లో డబ్బు, ధాన్యాలకు ఎటువంటి కొరత ఉండదని కూడా నమ్ముతారు. కనుక సాయంత్రం తులసి పూజ చేసి తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించండి.