Blast | బాంబులా పేలిన సెల్ఫోన్.. ఇంటి కిటికీలు, అద్దాలు ధ్వంసం

బ్లాస్ట్ | ఓ సెల్ఫోన్ బాంబు మాదిరి పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి ఇంటి కిటికీలు, అద్దాలతో పాటు కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో బుధవారం చోటు చేసుకుంది.
నాసిక్లోని సిడ్కో ఉత్తమ్ నగర్లో తుషార్ జగ్తాప్, శోభా జగ్తాప్, బాలకృష్ణ సుతార్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ ఇంట్లో నివాసముంటున్నారు. అయితే వీరు సెల్ఫోన్కు ఛార్జింగ్ పెట్టి నిద్రించారు. ఆ ఫోన్ ఉన్నట్టుండి.. ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ ఇంటి కిటికీలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. పక్కింటి కిటికీలు, అద్దాలు కూడా పగిలిపోయాయి. అంతేకాదు అక్కడ పార్క్ చేసిన కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇంట్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.