మైనారిటీల పేరుతో ఎంత కాలం రాజకీయాలు చేస్తారు? అని ప్రధాని ప్రశ్నించారు. నిజంగా ప్రధాని ఈ ప్రశ్న తనను తాను, వారి పార్టీ నేతలు ఈ విషయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ విపక్షాలపై సెటైర్లు వేస్తూ.. మహిళలు, యువత, పేదలు, రైతులపై దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నది. మైనారిటీల పేరుతో ఎంత కాలం రాజకీయాలు చేస్తారు? అని ప్రధాని ప్రశ్నించారు. నిజంగా ప్రధాని ఈ ప్రశ్న తనను తాను, వారి పార్టీ నేతలు ఈ విషయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. నరేంద్రమోడీ నేతృత్వంలోని పదేళ్ల పాలనలోనే 45 ఏళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. 2014 ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చారు. ఈ లెక్కన దాదాపు పది కోట్ల ఉద్యోగాలు ఈ దేశ యువతకు లభించాలి. కానీ మోడీ మాటలు ఆచరణలో అమలు కాలేదు. ఉద్యోగాలు కల్పించలేదు సరికదా ఉపాధి అవకాశాలు కల్పనకు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా అంతంత మాత్రమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
తమ పాలనలో 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బైటపడేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. తొమ్మిదేళ్ల కాలంలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బైటపడ్డారని నీతి ఆయోగ్ అశాస్త్రీయ లెక్కలను నిపుణులు తప్పుపట్టారు. బహుముఖ పేదరికాన్ని లెక్క గట్టడానికి అసంబద్ధ ప్రాతిపదికలు ఎంచుకోవడపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2011 నాటి జనా భా లెక్కల ప్రకారమే ఇప్పటికీ రేషన్ కార్డుల జారీ వల్ల కనీసం పది కోట్ల మంది వరకు అర్హులకు సంక్షేమ ప్రయోజనాలు దక్కడం లేదని విశ్లేషణలు చాటుతున్నాయి. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించామని, అది మా ఘనత గా చెప్పుకుంటున్నది. కానీ జనాభా లెక్కల తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఈ లెక్కన మహిళలు తమ కోటా కోసం ఇంకా ఎంత కాలం ఎదురుచూడాలోనని అంటున్నారు.
రైతుల సంక్షేమం గురించి మోడీ ప్రభుత్వం ఎన్నడో మరిచిపోయింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఏటా బట్జెట్లో కోతలు విధిస్తున్నది. ఆహారం, ఎరువులపై ఇస్తున్న రాయితీల్లోనూ కేంద్రం ఏటా కోతలు పెడుతున్నది. 2024-25 సంవత్సరారికి ఆహారం, ఎరువులపై రాయతీలను రూ. 3.69 లక్షల కోట్లుగా నిర్ణయించింది. 2024 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలతో పోలిస్తే 8 శాతం తగ్గింది. సాగు సాయం అంతంత మాత్రమే. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల ఈ రంగాన్ని వదిలి లక్షలాదిమంది ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారని విశ్లేషణలు చెబుతున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోడీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా రైతులు ఏడాదంతా పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ పోరాటంలో చాలామంది రైతులు అసువులుబాసారు. ఆ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం కూడా అందించలేదు. ఇలా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మైనారిటీల పేరుతో ఎంత కాలం రాజకీయం చేస్తారని ప్రధాని అనడం హాస్యాస్పదం. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నది ఎవరు? కర్ణాటక ఎన్నికల ప్రచారంలో జై బజరంగ్బలి అని ఒక వర్గం ఓట్లను ఆకర్షించడానికి ప్రయత్నించింది ఎవరు? హిందుత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నది ఏ పార్టీ వాళ్లు? అసలు మతం పేరుతో రాజకీయం చేస్తున్నదే బీజేపీ. భారత్ లౌకిక దేశం. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా ఒక వర్గంపై విద్వేషం వెళ్లగక్కుతూ 80-20 అంటూ ఆ పార్టీ యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు మోడీ అప్పుడే మరిచారా? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో మెజారిటీ మైనారిటీ అంశం తెరమీదికి వచ్చింది. అందరి సంక్షేమం కోసం పనిచేయాల్సిన వాళ్లు ఒక వర్గాన్ని కావాలనే విస్మరించడం పదేళ్లుగా చూస్తున్నదే. ప్రధాని మాటలు చూస్తే గురువింద నీతి గుర్తుకు వస్తున్నది. నిజంగా ప్రధానికి మహిళలు, యువత, పేదలు, రైతుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే అది మాటల్లో కాదు చేతల్లో చూపెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.