Viral Video | పంజాబ్‌లో ప‌ట్ట‌ప‌గ‌లే కాల్పులు.. దుకాణ య‌జ‌మాని దారుణ హ‌త్య‌

  • Publish Date - October 29, 2023 / 06:02 AM IST

Viral Video | పంజాబ్‌లోని భ‌టిండాలో దారుణం జ‌రిగింది. త‌న దుకాణం ముందు కూర్చున్న ఓ వ్య‌క్తిపై ఇద్ద‌రు దుండ‌గులు కాల్పులు జ‌రిపి ప‌రారీ అయ్యారు. తీవ్ర గాయాల‌తో దుకాణ య‌జ‌మాని ప్రాణాలు కోల్పోయారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌ర్జింద‌ర్ సింగ్ జోహ‌ల్ అనే వ్య‌క్తి భ‌టిండాలోని మాల్ రోడ్డులో ఓ దుకాణాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న మాల్ రోడ్డు అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌గా కూడా కొన‌సాగుతున్నారు. అయితే త‌న షాపు ముందు కూర్చున్న హ‌ర్జింద‌ర్‌పై బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు దుండ‌గులు కాల్పులు జ‌రిపి ప‌రారీ అయ్యారు. బుల్లెట్ గాయాల‌తో బాధ‌ప‌డుతున్న‌బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వంలో నేరాలు పెరిగాయ‌ని, అరాచకాలు కొనసాగుతున్నాయ‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ధ్వ‌జ‌మెత్తాయి. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించాయి. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాయి. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం భ‌గ‌వంత్ మాన్‌ను శిరోమ‌ణి అకాలీద‌ళ్ పార్టీ డిమాండ్ చేసింది.

మృతుడి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాల్పులు జ‌రిగిన ప్రాంతాన్ని పోలీసులు ప‌రిశీలించారు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తుల‌ను గుర్తించిన‌ట్లు పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే అదుపులోకి తీసుకుంటామ‌న్నారు పోలీసులు.

కాల్పుల శ‌బ్దం విని ప‌టాకులు అనుకున్నా..

ఈ ఘ‌ట‌న‌పై హ‌ర్జింద‌ర్ దుకాణంలో ప‌ని చేస్తున్న దీపు స్పందించాడు. తుపాకీ కాల్పుల శ‌బ్దం విని ఎవ‌రో ప‌టాకులు కాల్చుతున్నార‌న‌ని భావించాను. కాసేప‌టికే హ‌ర్జింద‌ర్ కాల్పులు జ‌రిపార‌ని అర‌వ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చాను. వారిని ప‌ట్టుకోండి అని ఆయ‌న ఆదేశించ‌డంతో ప‌రుగుపెట్టాను కానీ ఫ‌లితం లేకుండా పోయింది. బైక్‌పై ఇద్ద‌రూ పారిపోయారు అని దీపు చెప్పాడు. 

Latest News