కొన్ని సంవత్సరాలకి ముందు సమంతది హ్యాపీ లైఫ్. అక్కినేని కోడలిగా ప్రమోషన్ దక్కించుకోవడమే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కూడా దూసుకుపోయింది. అయితే ఊహించని విధంగా నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న సమంత ఆ విషయంలో చాలా డిప్రెషన్కి గురైంది. ఇక కొద్ది రోజుల తర్వాత తనకు మయోసైటిస్ వ్యాధి ఉందని చెప్పి మరో పెద్ద షాక్ ఇచ్చింది. ఈ వ్యాధి నివారణ కోసం ఏకంగా ఏడాది పాటు సినిమాలు కూడా మానేస్తున్నట్టు చెప్పింది. ఇప్పుడు పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టిన సమంత తరచుగా ఫారిన్ వెకేషన్స్ కు వెళ్తూ మానసిక ఉల్లాసాన్ని పొందుతోంది. రీసెంట్ గా బాలిలో తన మిత్రులతో కలిసి సరదాగా గడుపుతూ ఉండడం మనం చూసాం.
ఇక మధ్య మధ్యలో తన హెల్త్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది. తాజాగా తాను తన సోషల్ మీడియాలో కైరో థెరపీ చేయించుకుంటున్నట్లు ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో ఆమె పొగలు కక్కే చిలో ఓ టబ్ లో కూర్చుని కనిపించింది. చలి తీవ్రత -150 డిగ్రీల ఫారెన్ హీట్ ఉన్నట్లు అక్కడ డిస్ ప్లే లో కనిపిస్తోంది. ఈ థెరపీ వలన బ్లడ్ సెల్స్ బాగా పెరుగుతాయని, మన ఇమ్యూనిటీ సిస్టం బలంగా అవుతుందని, బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరుగుతుందని, బాడీకి ఎనర్జి రావడంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని మరో పోస్ట్ లో కైరో థెరపీ గురించి తెలియజేసింది. ఇప్పుడు సమంత థెరపీ చేయించుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరోవైపు సమంత ఈ వ్యాధి నుండి బయటపడేందుకు నిత్యం వ్యాయామాలు చేస్తూ కనిపిస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అలరిస్తుంది. గ్లామరస్ ఫోటోలతో కూడా హీటు పుట్టిస్తుంది. ఇక సమంత చివరగా ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇక వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ చేయగా, ఇది కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ లో రుస్సో బ్రదర్స్ దీన్ని తెరకెక్కించగా, రాజ్ అండ్ డీకే ఇండియన్ ఆడియెన్స్ కు అనుకూలంగా మార్పులు చేసి దీనిని తెరకెక్కించారు. ఇక సమంత సల్మాన్ తో కలిసి త్వరలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.