సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
విద్యార్థులకు ఇచ్చిన సంక్రాంతి సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. గతంలో జనవరి 18వ తేదీ వరకూ సెలవులు ప్రకటించగా.. తాజాగా వాటిని మరో మూడు రోజులు పొడిగించారు. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేశ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోరిక మేరకు సెలవులను పొడిగించినట్టు పేర్కొన్నారు. జనవరి 22న అంటే సోమవారం తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. పాత ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం నుంచి పాఠశాలలు తిరిగి పనిచేయాల్సి ఉన్నది. అయితే.. రెండు రోజుల తర్వాత మళ్లీ ఆదివారం వస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. సెలవులను పొడిగించడంతో పిల్లల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహించుకుంటారు. గతంలో కనీసం పది రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉండేవి. కానీ.. ఈసారి ఆరు రోజులు మాత్రమే ఇచ్చారు. సంక్రాంతి సెలవులను తగ్గించడంపై ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా సెలవుల పొడిగింపుపై విజ్ఞప్తి చేశాయి. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.