సిద్దు జొన్నలగడ్డ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు ఈ యువ హీరో. సిద్ధు పదేళ్ల క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య జోష్ సినిమాతో ఆయన తన సినీ కెరీర్ ప్రారంభం కాగా, డీజే టిల్లు చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 12న 2022న విడుదలై మంచి బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని దుమ్ము రేపడంతో అందరి దృష్టి సిద్ధుపై పడింది . పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు చిన్న సినిమాల్లో హీరోగా చేసినా రాని గుర్తింపు డీజే టిల్లుతో దక్కింది.
అయితే చిత్రంలో సిద్దు బాడీ లాంగ్వేజ్, ఆయన పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే డీజే టిల్లు చిత్రం అంత మంచి హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించారు. సిద్ధు, అనుపమ జంటగా డీజే టిల్లుకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ తెరకెక్కుతుంది. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుండగా, కొద్ది రోజుల క్రితం ఇందుకు సంబంధించి ప్రకటన చేశారు . ఇక ఇదిలా ఉంటే తాజాగా సిద్ధు డీజే టిల్లు సీక్వెల్ పై ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. నితిన్ తాజా చిత్రం ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ మూవీ ప్రమోషన్లో భాగంగా సిద్ధు మాట్లాడుతూ.. డీజే టిల్లు ఇప్పుడు ఒక్క సీక్వెల్ తో అయిపోదు. ఒక సిరీస్ లాగా ఆ తర్వాత రెండు మూడేళ్లకు ఒకసారి ఒక సీక్వెల్ ఉంటుంది అని అన్నాడు.
డీజే టిల్లు సీక్వెల్స్ చేస్తూనే వేరే సినిమాలు చేస్తాను. మధ్యలో ఆ సినిమా స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులకి ఇక సందడే సందడి దొరకనుంది. ఫిబ్రవరిలో రాబోతున్న టిల్లు స్క్వేర్ రిజల్ట్ తర్వాత సీక్వెల్స్ చేస్తాడా లేదా అనేది తెలియనుందని కొందరు అంటున్నారు. మరోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు హీరోగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సాయిప్రకాశ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.