Site icon vidhaatha

SBI new chairman | ఎస్‌బీఐ నూతన ఛైర్మన్‌గా తెలుగు తేజం.. ఉత్తర్వులు జారీచేసిన కేంద్రం..!

SBI new chairman : దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త చైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

ప్రస్తుతం ఎస్‌బీఐ ఛైర్మన్‌గా ఉన్న దినేశ్ కుమారా ఖారా ఈ నెల 28న పదవీ విరమణ చేయనున్నారు. అదేరోజున చల్లా శ్రీనివాసులు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీనివాసులు శెట్టిని ఎస్‌బీఐ ఛైర్మన్‌గా నియమించాలని ఆర్థిక సేవల డిపార్ట్‌మెంట్‌ ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ ఆమోదించింది. రాణా అశుతోష్‌ కుమార్‌ సింగ్‌ను బ్యాంక్‌ కొత్త ఎండీగా నియమించింది.

చల్లా శ్రీనివాసులు శెట్టి తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామంలో జన్మించారు. అగ్రికల్చరల్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేసిన చల్లా.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్‌లో సర్టిఫైడ్ అసోసియేట్‌గా కూడా పని చేశారు. తన వృత్తి జీవితాన్ని స్టేట్ బ్యాంకులో 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ప్రారంభించిన ఆయన.. ఇప్పుడు అదే బ్యాంకులో అత్యున్నత స్థానానికి ఎదగడం విశేషం. ఆయనకు కార్పొరేట్ లోన్స్, డిజిటల్, రిటైల్, గ్లోబల్ బ్యాంకింగ్ లాంటి రంగాల్లో విశేష అనుభవం ఉంది.

Exit mobile version