అక్షయ తృతీయకు ‘బంగార’మే.. రూ.1.85 లక్షల దాకా పెరగొచ్చని నివేదిక

అక్షయ తృతీయకు ముందు బంగారంపై భారీ అంచనాలున్నాయి. బంగారం ధర 10 గ్రాములకు రూ.1.85 లక్షల వరకు చేరవచ్చని Axis Direct నివేదిక వెల్లడించింది. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, గ్లోబల్ అనిశ్చితులు బంగారం ధర పెరిగేందుకు దోహదపడే అవకాశాలున్నాయి.

Akshaya Tritiya festive graphic with stacked gold bars background and decorative golden pot filled with coins

అక్షయ తృతీయ సందర్భంగా బంగారం పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతున్న వేళ...

Buying Gold for Akshaya Tritiya? Prices May Surge to Rs 1.85 Lakh

హైలైట్ పాయింట్స్
  • తులం బంగారం ధర రూ.1.85 లక్షల వరకు వెళ్లొచ్చని అంచనా
  • కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు గోల్డ్‌కు బలం
  • వడ్డీ రేట్లు తగ్గినా.. ద్రవ్యోల్బణం పెరిగినా బంగారానికే లాభం
  • గత 10 ఏళ్లలో నిఫ్టీ కంటే మెరుగైన రాబడులు
  • అక్షయ తృతీయకు దృష్టి మళ్లీ బంగారం వైపు

 

విధాత బిజినెస్​ డెస్క్​ | 18 ఏప్రిల్​ 2026 | హైదరాబాద్​:

Gold for Akshaya Tritiya | అక్షయ తృతీయ అంటే చాలు.. భారతీయులకు బంగారం గుర్తుకొస్తుంది. ఎంతో కొంత కొనకపోతే మనశ్శాంతి ఉండదు. అయితే ఈసారి సంప్రదాయం మాత్రమే కాదు.. పెట్టుబడి కోణంలో కూడా బంగారానికి భారీ లాభం కనిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, వడ్డీ రేట్ల కోతల అవకాశాలు, ద్రవ్యోల్బణ భయాలు కలిసి బంగారం ధరలను మరింత పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ Axis Direct అంచనా వేసింది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.70 లక్షల నుంచి రూ.1.85 లక్షల వరకు చేరవచ్చని నివేదికలో పేర్కొంది.

ఆర్థిక పరిస్థితులు బంగారానికే అనుకూలం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళ్లినా.. లేదా వడ్డీ రేట్లు తగ్గి వృద్ధి తిరిగి పెరిగినా.. రెండు పరిస్థితుల్లోనూ బంగారానికి లాభమేనని నివేదిక తెలిపింది. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అలాంటి సమయంలో పెట్టుబడిదారులు భద్రమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటారు.

మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే, వడ్డీ లేని బంగారం ధరలకు మద్దతు లభిస్తుంది. అందువల్ల ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎటువైపు కదిలినా బంగారానికి మంచే జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

గత దశాబ్దంలో షేర్ మార్కెట్ కంటే మెరుగైన రాబడులు

అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్ల కోసం నగల దుకాణాల్లో సందడి

గత 10 ఏళ్ల అక్షయ తృతీయ నుంచి అక్షయ తృతీయ వరకు చూసినప్పుడు బంగారం సగటున 18 శాతం కాంపౌండెడ్ వార్షిక రాబడిని ఇచ్చిందని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో నిఫ్టీ-50పై బంగారం మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

2016లో రూ.100 బంగారంలో పెట్టుబడి పెట్టి ఉంటే.. అది ఇప్పుడు రూ.527కు చేరేదని, అదే నిఫ్టీలో అయితే రూ.307 మాత్రమే అయ్యేదని వివరించింది. ముఖ్యంగా గత కొన్నేళ్లలో 18శాతం, 22శాతం, 30శాతం రాబడుల తర్వాత 2025-26లో 61శాతం వరకు ఎగసిందని పేర్కొంది.

అక్షయ తృతీయ సందర్భంగా సంప్రదాయంగా బంగారం కొనేవారికి ఈసారి పెట్టుబడి కోణంలోనూ మంచి సంకేతాలే కనిపిస్తున్నాయి. అయితే ధరలు ఇప్పటికే భారీగా పెరిగినందున, ఒక్కసారిగా కొనకుండా దశలవారీగా కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News