విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక, రాజకీయ మార్పులు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. శుక్రవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,960 పెరిగి రూ. 1,50,930కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,800 పెరిగి రూ. 138,350 వద్ద నిలిచింది. కిలో వెండి ధర మాత్రం 2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
భవిష్యత్తులో పసిడి ధరల పరుగులు
ప్రముఖ వెటరన్ ఇన్వెస్టర్ పీటర్ షిఫ్ అంచనా మేరకు రాబోయే నెలల్లో బంగారం ధరలు భారీగా పుంజుకోనున్నాయి. నెల రోజుల్లోనే భారీగా ధరలు పెరుగవచ్చని.. 1980 తర్వాత మళ్ళీ అంతటి భారీ లాభాలను బంగారం ఈ నెలలో అందించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ప్రస్తుతం ఔన్సుకు సుమారు 4,800 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, త్వరలోనే ఇది 5,000 డాలర్లను దాటి, ఆపై 6,000 డాలర్ల మార్కును చేరుకుంటుందని పీటర్ షిఫ్ అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు ఇప్పుడు అమెరికా డాలర్ కంటే కూడా సురక్షితమైన ఆస్తులైన బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుండటమే దీనికి ప్రధాన కారణంగా ఆయన విశ్లేషిస్తున్నారు.
దిగుమతులపై కేంద్రం ఆంక్షలు
మరోవైపు దేశీయ మార్కెట్లో పసిడి, వెండి వెలుగులకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండి వస్తువులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా కఠినమైన ఆంక్షలు విధించింది.ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లను (FTAs) అడ్డుపెట్టుకొని జరుగుతున్న కొన్ని అవకతవకలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా నిబంధనల ప్రకారం.. కేవలం ముడి బంగారం, వెండి మాత్రమే కాకుండా ప్లాటినం, ముత్యాలు, విలువైన రాళ్లు, ఇమిటేషన్ జ్యువెలరీ , నాణేలపై కూడా ఈ పరిమితులు వర్తిస్తాయి. ప్రభుత్వ నిర్ణయంతో మార్కెట్లో బంగారం , వెండి సరఫరాపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉంది. సరఫరా తగ్గితే ధరలు పెరిగే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం లైసెన్సింగ్ ప్రక్రియను సులభతరం చేస్తే, నిజాయితీగా వ్యాపారం చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
ఎస్సీ, ఎస్టీల హామీల అమలులో కాంగ్రెస్ మొండి చెయ్యి : హరీశ్ రావు
Virosh | రష్మిక పోస్ట్తో అందరిలో అనేక ఆలోచనలు.. గుడ్ న్యూస్ చెప్పబోతుందా అంటూ కామెంట్స్
