Forbes list : రియలన్స్ఇండస్ట్రీస్చైర్మన్ ముకేశ్ అంబానీ దేశంలోనేగాక ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ‘ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2024 : ది టాప్ 200’ పేరుతో అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తీసుకొచ్చిన తాజా సంచిక ఈ వివరాలను వెల్లడించింది. ముకేశ్ అంబానీ నికర సంపద ప్రస్తుతం 116 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9.68 లక్షల కోట్లు) ఉందని ఫోర్బ్స్ పేర్కొంది. ఫోర్బ్స్ జాబితాలోని భారతీయ బిలియనీర్లు అందరి నికర సంపద రికార్డు స్థాయిలో 954 బిలియన్ డాలర్లుగా ఉంది.
కాగా, అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్లో ప్రవేశించిన మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారు. ప్రపంచంలోనే తొమ్మిదో అత్యంత సంపన్నుడిగా ఆయన ఉన్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్ల నికర సంపదతో రెండో అత్యంత సంపన్న భారతీయుడుగా జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశంలో అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ఎదిగారు. మన దేశంలో నాలుగో ధనిక వ్యక్తిగా ఉన్నారు. ఆమె నికర సంపద విలువ 33.5 బిలియన్ డాలర్లు.
ఫోర్బ్స్ 2024 జాబితాలో తొలిసారిగా 25 మంది భారతీయ బిలియనీర్లు చోటు సంపాదించారు. వారిలో నరేష్ ట్రెహాన్ (మెదాంత మేనేజింగ్ డైరెక్టర్), రమేష్ కున్హికన్నన్ (కేన్స్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్), రేణుకా జగ్తియాని (ల్యాండ్మార్క్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) ఉన్నారు. ఈసారి బైజు రవీంద్రన్, రోహికా మిస్త్రీకి ఈ లిస్టులో స్థానం దక్కలేదు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం మొత్తం నికర సంపద విలువ 233 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో ఎలాన్ మస్క్ (195 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్ (194 బిలియన్ డాలర్లు) ఉన్నారు. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేనంతగా 2,781 మంది బిలియనీర్లు ఫోర్బ్స్ లిస్టులో చోటు దక్కించుకున్నారు.