రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌..! బై బ్యాక్‌ ప్లాన్‌తో 77శాతం డబ్బు రిటర్న్‌..!

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌..! బై బ్యాక్‌ ప్లాన్‌తో 77శాతం డబ్బు రిటర్న్‌..!

విధాత‌: ద్విచక్ర వాహనాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది. చాలా మందికి ఈ బైక్‌లను కొనుగోలు చేయాలని ఆశిస్తుంటారు. బైక్‌ రేట్లను చూసి మధ్యతరగతి జనాలు వెనక్కి తగ్గుతుంటారు. అయితే, దీన్ని దృష్టిలో పెట్టుకొని బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ బై బ్యాక్‌ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ ద్వారా వినియోగదారుడు కొన్న బైక్‌ను కొంతకాలం తర్వాత మళ్లీ రాయల్ ఎన్ ఫీల్డ్ కొనుగోలు చేస్తుంది.


అయితే, బైక్‌ను వినియోగదారుడు వాడే వ్యవధిని బట్టి బైబ్యాక్‌ ఆధారపడి ఉండనున్నది. బైక్‌ ధరపై గరిష్ఠంగా 77శాతం వరకు బైక్‌ బ్యాక్‌ స్కీమ్‌లో తిరిగి చెల్లించనున్నట్లు కంపెనీ పేర్కొంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ స్కీమ్‌ కోసం ఓటీఓ క్యాపిటల్‌ సంస్థతో జతకట్టింది. ఖచ్చితమైన రీసేల్‌ వాల్యూ ప్రకారం.. కంపెనీకి చెందిన ఏ బైక్‌ మోడల్‌నైనా కొనుగోలు చేసిన వినియోగదారుడు కోరుకున్నంతకాలం ఆ బైక్‌ను వాడుకొని.. తర్వాత తిరిగి కంపెనీకి ఇవ్వొచ్చని పేర్కొంది.


ఇక ప్రోగ్రామ్‌లో వినియోగదారుడు ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఏదో ఒక ప్లాన్‌ను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. బైక్‌ బ్యాక్‌తో పాటు తక్కువ ఈఎంఐ సదుపాయం సైతం ఈ ప్రోగ్రామ్‌లో లభిస్తుంది. నెలవారీ వాయిదాల మొత్తంలో 45శాతం వరకు తగ్గనున్నది. సెలెక్ట్‌ చేసుకున్న టన్యూర్‌ కంప్లీట్‌ అయ్యాక వినియోగదారుడికి ప్రత్యేకంగా క్యాష్‌బ్యాక్‌ను సైతం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అందిస్తున్నది.


మొదట ఎంపిక చేసుకున్న ప్లాన్‌ ప్రకారంగా టెన్యూర్‌ ముగిసిన తర్వాత బైక్‌ను వెనక్కి ఇవ్వొచ్చు.. లేదంటే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన మరి ఏదైనా బైక్‌తో ఎక్స్ఛేంజ్‌ చేసుకునే వీలు కూడా ఉంది. వినియోగదారులను సంతృప్తి పరచడమే తమ ప్రధాన ఉద్దేశమని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ స్కీమ్‌ ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ సహా 12 నగరాల్లో అందుబాటులో ఉందని, రాబోయే రోజుల్లో మరికొన్ని నగరాలకు సైతం విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.