Spiritual | ప్రతి రోజు వేకువజామునే ఈ మూడింటిని చేస్తే.. రోజంతా శుభాలే జరుగుతాయట..!
Spiritual | చాలా మంది నిద్ర లేచిన వెంటనే.. తమ అర చేతులను చూసుకుంటారు. లేదంటే దేవుళ్ల ఫొటోలు చూసిన తర్వాతే ఇతరుల వైపు చూస్తుంటారు. అయితే ప్రతి రోజూ వేకువజామునే ఈ మూడింటిని చూస్తే.. ఆ రోజంతా శుభాలే జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ మూడు ఏంటో తెలుసుకుందాం..

Spiritual | చాలా మంది పొద్దున్నే లేవగానే తమకు ఇష్టమైన దేవుళ్లు లేదంటే వ్యక్తుల ముఖాలు చూస్తుంటారు. ఇంట్లో పసి పిల్లలు ఉంటే వారి ముఖాలను చూసిన తర్వాతే భర్త వైపు లేదా భార్య వైపు చూసి.. ఆ తర్వాత ఇతరుల వైపు కన్నెత్తి చూస్తారు. ఇంకొందరైతే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటారు. మరికొందరు అర చేతులను చూసుకుని దేవుళ్లకు నమస్కారం చేస్తుంటారు. అయితే మూడు ముఖ్య నియమాలు పాటించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు ఈ మూడు నియమాలు పాటించిన వారికి ఆ రోజంతా శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ మూడు నియమాలు ఏంటో తెలుసుకుందాం.
సూర్యోదయానికి ముందే మేల్కొనాలి..
ఇంట్లో ప్రతి ఒక్కరూ సూర్యుడు ఉదయించడానికి ముందే మేల్కొనాలి. ఇంట్లోని చిన్నపిల్లలకు మినహాయింపు ఇవ్వొచ్చు. సూర్యోదయానికి ముందు అంటే బ్రహ్మ ముహుర్తంలో అని అర్థం. అంటే సూర్యుడు ఉదయించే కంటే 90 నిమిషాల ముందు తప్పనిసరిగా నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది బ్రహ్మముహూర్తం. కాబట్టి హిందూ ధర్మశాస్త్రాల్లో ఈ ముహూర్తం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన ఉంది. ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్యవంతంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి ఉంటుంది. అందుకే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచేవారిలో సానుకూల ఆలోచనలు వస్తాయి. ఈ సానుకూలశక్తితో ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. ఈ ముహూర్త సమయంలో వీచేగాలి అమృతంతో సమానంగా భావిస్తారు.
వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలు, ఆరోగ్యం వృద్ధి చెందుతాయిని పై శ్లోకానికి అర్థం.
అరచేతులు చూసుకుని నమస్కరించాలి
నిద్రలేచిన వెంటనే చాలామంది తమ అర చేతులు చూసుకుంటారు. ఇది చాలా మంచి అలవాటు అని పండితులు చెబుతున్నారు.
“కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం”
కరాగ్రే వసతే లక్ష్మీ – అరచేయి పైభాగనంలో శ్రీ మహాలక్ష్మి
కర మధ్యే సరస్వతి – చేయి మధ్యభాగంలో సరస్వతి
కర మూలే స్థితా గౌరీ – మణికట్టు వద్ద గౌరీదేవి కొలువై ఉంటారు.
ప్రాతః కాలంలో ఈ శ్లోకం చదివి అరచేతులను కళ్లకు అద్దుకుని లేవడం ద్వారా.. ఆ మూడు శక్తులను స్మరించినట్టు. అందుకే నిద్రలేస్తూ అరచేతులకు నమస్కరించి లేస్తే అంతా శుభమే అని చెబుతారు.
భూమికి నమస్కారం చేయాలి
సముద్ర వసనే దేవీ పర్వతస్థన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే
నిద్రలేచిన తర్వాత కాలు కింద మోపే ముందు ఈ శ్లోకం చదవాలి. వాసం అంటే దుస్తులు… సముద్రవసనే దేవీ అంటే సముద్రాన్ని వాసంగా ధరించిన దేవీ అని అర్థం. 70 శాతం భూమి నీటితో కప్పి ఉంటుంది. భారతీయులు శరీరాన్ని 70 శాతం దుస్తులతో కప్పుకున్నట్టే.. భూమిపై 70 శాతం నీరున్న ప్రదేశాన్ని దుస్తులుగా ధరించావమ్మా అని అర్థం. పర్వత స్థన మండలే అంటే పర్వతాలను స్థానాలుగా కలిగిన దేవి… అంటే బిడ్డలు అడగకుండానే ఆకలి తెలుసుకుని పాలిచ్చే తల్లి అని అర్థం. అలాంటి భూదేవిపై కాలుమోపుతున్నందుకు క్షమించమని అడుగుతూ అడుగు నేలపై పెట్టాలి.