భూమిపై ప్రతి జీవరాశి మనుగడ సాగిస్తున్నదంటే అందుకు భానుడే ప్రధానం. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవం అంటారు. ఆయనకు ప్రత్యేక పూజలు చేసే రోజు రానే వచ్చింది
Ratha Sapthami | భూమిపై ప్రతి జీవరాశి మనుగడ సాగిస్తున్నదంటే అందుకు భానుడే ప్రధానం. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవం అంటారు. ఆయనకు ప్రత్యేక పూజలు చేసే రోజు రానే వచ్చింది. భాస్కరుడు ఆవిర్భవించిన మాఘ శుక్ల సప్తమి, ఆయనను ఆరాధించేందుకు అనువైన రోజు. ఈ రోజున వేకువజామునే కాలకృత్యాలు తీర్చుకుని, సూర్యోదయం అయ్యే సమయానికి నదీ స్నానం చేసి తమకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోట్లాది మంది కోరి మొక్కుతారు. రోజూ చేసే సూర్య నమస్కారం కన్నా రెట్టింపు ఫలితం రథసప్తమి రోజు దక్కుతుందని భావిస్తారు.
సూర్యోపాసనతో మృత్యుభయ హరణం
రథసప్తమి రోజు ప్రాతఃకాలం గంగలో స్నానం చేసి సూర్యోపాసన చేస్తే మృత్యుభయం పోతుందని విశ్వసిస్తారు. అందుకే రథసప్తమి రోజు అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా గంగ స్నానం ఆచరించాలి. తలపై ఏడు జిల్లేడు ఆకులు, రేగుపళ్లు ఉంచుకుని స్నానం చేయాలి. జిల్లేడు ఆకును అర్కపత్రం అంటారు. సూర్యునికి ‘అర్కః’ అని పేరు. అందువల్ల సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. సూర్య రథానికి ఉండే ఏడు గుర్రాలు, ఏడు జన్మల్లో చేసిన పాపాలు, ఏడురకాలైన వ్యాధులకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులు తలపై పెట్టుకుని స్నానం చేయాలని చెబుతారు.
నదీ దీపం.. శ్రేష్ఠం
నదిలో స్నానం చేసిన తర్వాత నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే మంచిదని పండితులు చెబుతున్నారు. రథ సప్తమిరోజున ఆవు నేతితో దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పేర్కొంటున్నారు.
సూర్య కిరణాలు పడేచోట..
రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలకాలి. దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, సంకాంత్రి రోజున పెట్టిన పిడకలు, గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగించాలి. తర్వాత కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం వండి సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం పెట్టి దేవుడికి నైవేద్యం సమర్పించాలి. సూర్యుడిని ఎరుపు రంగు పూలతో పూజించాలి. రథసప్తమి రోజు బంగారం, వెండి లేదా రాగితో.. ఎవరి స్తోమతను బట్టి వారు సూర్యుడికి చిన్న రథం చేయించి పూజించాలి.
ఈ రోజున ఉపవాసం ఉండి దైవారాదనలోనే కాలం గడిపితే సూర్య భగవానుడి అనుగ్రహం పొందుతారు. ఈ రోజునే ముత్తయిదువులు తమ నోములు, వ్రతాలకు శ్రీకారం చుడుతారు. చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము, పదహారు ఫలాల నోము, గ్రామకుంకుమ నోమును ఈ రోజే ప్రారంభిస్తారు. ఈ రోజు ఏ మంచిపని తలపెట్టినా విజయవంతగా పూర్తవుతుందని నమ్ముతారు. సూర్యుడిని ఈ రోజు పూజిస్తే అప్పుల బాధలు, అనారోగ్యం, శత్రుబాధలు నశిస్తాయని విశ్వసిస్తారు.